జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారశైలి, వారిపై వస్తున్న వరుస ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా జనసేన అంతర్గత వర్గాల్లో సంచలనంగా మారాయి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులకు పార్టీ అధినేత, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ నుండి అత్యవసర పిలుపు వచ్చింది. వెంటనే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పవన్ ఆదేశించడంతో జనసేన కేడర్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read : చంద్రబాబుకు తల నొప్పిగా గుంటూరు ఎమ్మెల్యేలు..!
ముఖ్యంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఇటీవల ఓ ప్రభుత్వ ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు రావడం పార్టీ ప్రతిష్టకు పెద్ద డ్యామేజ్ గా మారింది. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. ఒక త్రిసభ్య కమిటీని రంగంలోకి దించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి, ఇప్పటికే పవన్ కల్యాణ్ కు ఒక నివేదికను కూడా సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..?
మరోవైపు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై కూడా స్థానికంగా పలు అవినీతి, గ్రూపు రాజకీయాల ఆరోపణలు అధిష్టానానికి వెళ్లాయి. ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై అధికారులతో నిర్వహిస్తున్న సమీక్ష ముగిసిన వెంటనే.. పవన్ కల్యాణ్ ఈ ఇరువురు ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కానున్నారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టును ముందే పెట్టుకుని అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ గట్టిగా క్లాస్ పీకడమే కాకుండా, అవసరమైతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా వదిలిపెట్టనని గతంలోనే హెచ్చరించిన పవన్.. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

