గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మళ్లీ వేగంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత నియోజకవర్గంలో తిరిగి యాక్టివ్ కావడం స్థానికంగా సరికొత్త చర్చకు దారితీస్తోంది. వివిధ కేసుల కారణంగా దాదాపు 137 రోజుల పాటు విజయవాడ జిల్లా జైలులో గడిపిన ఆయన, అన్ని కేసుల్లో బెయిల్ పొంది ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. జైలు జీవితం, ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల నేపథ్యంలో ప్రస్తుతం వంశీపై ఒక వర్గం ఓటర్లలో సానుభూతి పవనాలు వీస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ మొదలైంది.
Also Read : కేబినేట్ ప్రక్షాళనకు మోడీ ప్లాన్.. తెలంగాణాకు పెద్ద పీట..?
వాస్తవానికి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైన కోటగా ఉంది. 2009 నుండి 2024 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీయే విజయం సాధిస్తూ వస్తోంది. వల్లభనేని వంశీ కూడా 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన వైసీపీకి తీర్ధం పుచ్చుకోవడం జరిగాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోవడం తెలిసిందే. ఓటమి అనంతరం ఆయనపై వరుస కేసులు నమోదు కావడంతో రాజకీయాలకు కొంతకాలం దూరమయ్యారు.
Also Read : నీటితో వ్యాపారం.. కోట్లల్లో సంపాదన..!
ప్రస్తుతం వంశీ రీ-ఎంట్రీతో నియోజకవర్గంలో సరికొత్త లెక్కలు మొదలయ్యాయి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆయన గన్నవరం వచ్చినప్పుడల్లా అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న కొంత వ్యతిరేకత, వంశీపై ఉన్న సానుభూతి కలిసి.. ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీలోని ఒక వర్గం కూడా లోపాయికారీగా వంశీకి మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు అధికార టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, పార్టీ నష్టనివారణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

