పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది.
ముఖ్యంగా కోల్ కతా, దాని పరిసర మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలు, అనధికార హాకర్లను లక్ష్యంగా చేసుకొని భారీ ఎత్తున కూల్చివేతలు ప్రారంభించింది. హౌరా, సీల్దా రైల్వేస్టేషన్ల వద్ద
బుల్డోజర్లతో వందల దుకాణాలను తొలగించారు. ఈ చర్యలు కేవలం ఆరంభం మాత్రమేనని, రాష్ట్రవ్యాప్తంగా బుల్డోజర్లు నడుపుతామని బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ హెచ్చరించారు. “కొత్త ప్రభుత్వం మొదటి రోజు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వ భూమిలో ఎలాంటి ఆక్రమణలను సహించబోం” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read : దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం..!
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే హౌరా, సీల్దా రైల్వేస్టేషన్ల పరిసరాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ప్రభుత్వ రైల్వే పోలీస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. హౌరా స్టేషన్ వద్ద గంగా ఘాట్ నుంచి స్టేషన్ ప్రాంగణం వరకు సుమారు 150 తాత్కాలిక దుకాణాలు, 200 మంది హాకర్లను తొలగించారు. సీల్దా స్టేషన్లో ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ప్లాట్ఫారమ్ పై ఉన్న దాదాపు 250 స్టాళ్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం కోల్కతలోని తోప్సియా తిల్జాలా ప్రాంతంలో అక్రమ లెదర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు మరణించడంతో, ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశాల మేరకు అక్కడ కూడా కూల్చివేతలు చేపట్టారు. ఆ ప్రాంతంలో దాదాపు 70 శాతం నిర్మాణాలు అక్రమమైనవని అధికారులు గుర్తించారు. అయితే, సరైన నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయిస్తున్నారని కొందరు నివాసితులు కోర్టును ఆశ్రయించడంతో, కలకత్తా హైకోర్టు జూన్ 22 వరకు కూల్చివేతలపై మధ్యంతర స్టే విధించింది.
Also Read : టీ బీజేపీలో భారీ మార్పు.. రంగంలోకి ఈటల..!
దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్న తమ దుకాణాలను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్లుగా నడుపుతున్న వ్యాపారాలను రాత్రికి రాత్రి కూల్చేశారని.. ఇప్పుడు మేం. ఎక్కడికి వెళ్లాలంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పునరావాసం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు కఠిన చర్యలతో ముందుకు వెళ్తుండగా, మరోవైపు బాధితుల నిరసనలు, న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి.

