ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ఆసక్తిని రేపుతోంది. ఈ పర్యటనలో పలు కీలక అడుగులు పడే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించేందుకు ఆయన ఈ పర్యటనను చేపట్టారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం, రోజంతా వరుస భేటీలతో బిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
Also Read: మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!
రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి సమావేశమై, పోలవరం ప్రాజెక్టు పనులు మరియు రాష్ట్రంలోని ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని, మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఏపీలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందే అంశంపై ఇక్కడ చర్చలు జరుగుతాయి.
Also Read: సూపర్ ఎల్నినో.. భయపెడుతున్న కరువు..!
ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీలో జరిగే సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరై, పారిశ్రామిక వేత్తలతో మాట్లాడనున్నారు. వీటితో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్ లతో కూడా సీఎం భేటీ కానున్నారు. నేటి రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, రేపు ఉదయం అస్సాంకు బయలుదేరతారు. అక్కడ జరగనున్న అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీతో సిఎం చంద్రబాబు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది.

