“రోహిణిలో రోళ్లు పగులుతాయి” అని పెద్దలు చెప్పిన మాట ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతోంది. రోహిణి కార్తె రాక ముందే ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. రాత్రివేళలో కూడా ఉక్కపోత తగ్గటం లేదు. ఎండకు తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ వేసవి కాదని.. రాబోయే విపత్తుకు ప్రకృతి ముందస్తు హెచ్చరికలు పంపుతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : అసలు విజయ్ చుట్టూ ఏమి జరుగుతుంది..? బలం లేకున్నా రాజ్ భవన్ కు ఎందుకు..?
పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కే పరిస్థితిని “ఎల్నినో” అంటారు. అదే తీవ్రస్థాయికి చేరితే దాన్ని “సూపర్ ఎల్నినో”గా పరిగణిస్తారు. తాజా అంచనాల ప్రకారం జూలై నాటికి ఎల్నినో ఏర్పడే అవకాశాలు భారీగా ఉన్నాయని, ఆగస్టు నాటికి అది మరింత బలపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అస్తవ్యస్తం కావచ్చని హెచ్చరిస్తున్నారు.
సూపర్ ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉంది. వర్షాలు తగ్గిపోతే సాగు, తాగు నీటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరాయి. ఒక వైపు మండుతున్న ఎండలు నీటిని ఆవిరి చేస్తుండగా.. మరో వైపు వర్షాలు కురవకపోతే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : 2028 నుంచి ఐపీఎల్లో భారీ మార్పులు..!
1876-78 మధ్య కాలంలో వచ్చిన మహాఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా భారీ కరువుకు దారితీసింది. భారతదేశంలో లక్షలాది మంది ఆకలి, దాహంతో ప్రాణాలు కోల్పోయారు. నదులు ఎండిపోయాయి.. పంటలు నాశనమయ్యాయి.. ప్రజలు గుక్కెడు నీటి కోసం విలవిలలాడిన దృశ్యాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే పునరావృతం అవుతాయేమో అనే భయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం కనిపిస్తున్న ఎండలు కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదల కాదు.. ప్రకృతి ఇస్తున్న ప్రమాద సంకేతాలు. రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నీటి వనరుల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వ, తక్కువ నీటితో పండే పంటల ప్రోత్సాహం వంటి చర్యలు వెంటనే అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించేది సామాన్య ప్రజలేనని హెచ్చరిస్తున్నారు.

