విశాఖ రైల్వేస్టేషన్ కమర్షియల్ విభాగంలో అతిపెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘకాలంగా విశాఖలో పనిచేస్తున్న అధికారి అధిక సంఖ్యలో రైల్వే ఈఎఫ్టీ.. ఎక్సెస్ ఫేర్ టికెట్ పుస్తకాలు మాయం చేసి కోట్ల రుపాయల సొమ్ము దోచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదిహేనేళ్ల క్రితం ఖుర్దా రోడ్డు డివిజన్ నుంచి విశాఖకు వచ్చిన ఓ అధికారి ఈ మాయాజాలానికి కారణమని తెలుస్తోంది. టికెట్ లేని ప్రయాణీకులతో పాటు సాధారణ టికెట్తో రిజర్వేషన్ బోగీలో ప్రయాణం చేస్తున్న వారి నుంచి జరిమానా వసూలు చేస్తారు. ఆ జరిమానాకు రశీదు కూడా ఇస్తారు. ఆ తర్వాత ఆ జరిమానా మొత్తాన్ని కూడా రైల్వే ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే మోసానికి తెర లేపినట్లు తెలుస్తోంది.
Also Read : వాజపేయి కోరిక తీర్చిన మోడీషా..!
టికెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణికుల నుండి వసూలు చేసిన జరిమానా మొత్తాన్ని రైల్వే ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. సుమారు రెండేళ్ల నుంచి ఈ దోపిడీ జరుగుతోందని 300 నుంచి 350 వరకు ఈఎఫ్టీ పుస్తకాలు మాయమైనట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. ప్రయాణికుల నుండి వసూలు చేసిన మొత్తాన్ని రికార్డుల్లో తక్కువగా చూపించినట్లు కూడా తెలుస్తోంది. అవినీతి వ్యవహారం బయటకు రాకుండా భద్రపరచిన ఈఎఫ్టీ పుస్తకాలు మంటల్లో కాల్చి బూడిద చేసినట్లు తెలుస్తోంది. ఆడిట్ అధికారులకు కూడా కొంత ముట్టచెప్పి ఈ అవినీతి భాగోతం బయటకు రాకుండా సదరు అధికారి వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమర్షియల్ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుంటూ సుదీర్ఘకాలం విశాఖలో పనిచేస్తున్న సదరు అధికారి వ్యవహారశైలిపై విజిలెన్సు అధికారులు దృష్టి సారించి దోచుకున్న మొత్తం రైల్వే సొమ్మును కక్కించాలని రైల్వే ఉద్యోగులు కోరుతున్నారు. ఇదే అధికారి కీలకమైన ఎమినిటీస్ విభాగంలో పాగా వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైలే ఉన్నతాధికారులు విజిలెన్సు అధికారులు, ఆడిట్ అధికారులు నిత్యం సంచరించే విభాగంలోనే కోట్ల రూపాయలు మింగేసిన సదరు అధికారి కీలకమైన ఎమినిటీస్ విభాగంలో అడుగుపెడితే మరిన్ని కోట్ల రూపాయల రైల్వే సొమ్ము కొట్టేయడం ఖాయమంటున్నారు.
Also Read : జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందా..?
రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి కూడా నాలుగేళ్లకు మించి ఒకే చోట పని చేయకూడదు. విశాఖ అధికారులు కూడా ఇదే రూల్ పాటిస్తున్నారు. ఏ ఉద్యోగిని నాలుగేళ్లకు మించి ఒకే స్థానంలో కొనసాగనివ్వటం లేదు. కానీ అదే అధికారులు మాత్రం.. ఈ అధికారిని ఏకంగా 15 ఏళ్లుగా విశాఖలో కొనసాగించడం వెనుక రహస్యమేమిటో తెలియటం లేదని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు, విజిలెన్సు అధికారులు సదరు వ్యవహార౦పై లోతైన విచారణ జరిపించి దోచుకున్న కోట్లాది రూపాయలను రైల్వేకు జమ చేయించి సదరు అవినీతి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో కమర్షియల్ విభాగంలో లోపాలపై కూడా దృష్టి సారించి మరోసారి రైల్వే సొమ్ము దొంగల పాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

