ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతూ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో కేవలం ఆడంబరాల కోసం, ప్రచారం కోసం ప్రవేశపెట్టిన ఫ్యాన్సీ విద్యా విధానాలకు స్వస్తి పలికి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా క్షేత్రస్థాయి సంస్కరణలపై ఆయన దృష్టి సారించారు. విద్యలో కేవలం గాలిలో మేడలు కడితే సరిపోదు.. విద్యార్థి చదువుకు గట్టి పునాది వేయడమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read : సీఎం రాజీనామా చేయకపోతే..? రాజ్యాంగం ఏం చెప్తుంది..?
రాష్ట్రంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ సమస్యలను లోతుగా పరిశీలించిన మంత్రి, సమస్య ఎక్కడ ఉందో అక్కడి నుంచే పరిష్కార మార్గాలను వెతకాలని నిర్ణయించారు. కేవలం భవనాలకు రంగులు వేయడం లేదా ట్యాబ్ లు పంపిణీ చేయడం ద్వారానే విద్య రాదని, తరగతి గదిలో బోధన నాణ్యంగా ఉన్నప్పుడే విద్యార్థి రాణించగలడని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ప్రాథమిక స్థాయి నుంచే అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేశారు.
ముఖ్యంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల మేధస్సును పెంచేందుకు G-FLN (గ్లోబల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) మరియు TaRL (టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్) వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. విద్యార్థి తన తరగతికి తగ్గట్టుగా చదవడం, రాయడం మరియు ప్రాథమిక గణితం చేయగలిగేలా తీర్చిదిద్దడమే ఈ విధానాల ముఖ్య ఉద్దేశం. విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించి, ఆ స్థాయి నుంచి అతన్ని పైకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
విద్యా వ్యవస్థలో రాజకీయాలకు తావులేకుండా, కేవలం విద్యార్థుల అభివృద్ధిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. బాహ్య అలంకరణల కంటే, విద్యార్థుల ఆలోచనా శక్తిని పెంచే పునాది దశ చదువులపైనే తాము పెట్టుబడి పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులు ఏపీ విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతాయని మరియు పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలను కల్పిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

