పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లక్ష్యంగా విపక్షాలు చేసిన ఆరోపణలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం మద్యం సేవించి సభకు వచ్చారంటూ ప్రతిపక్ష నేతలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష సభ్యులు సీఎం భగవంత్ మాన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మద్యం మత్తులో ఉన్నారని, అందుకే ఆయనకు వెంటనే బ్రీతింగ్ టెస్ట్ నిర్వహించాలని పట్టుబట్టారు.
Also Read : LPG సిలెండర్లపై నేటి నుంచే కొత్త రూల్స్..!
గతంలో కూడా భగవంత్మాన్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు నేరుగా సభలోనే విపక్షాలు ఈ డిమాండ్ చేయడం కలకలం రేపింది. విపక్షాల అభ్యర్థనను అసెంబ్లీ స్పీకర్ తీవ్రంగా తోసిపుచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మందలించారు. అయితే, స్పీకర్ నిర్ణయంతో ఏకీభవించని ప్రతిపక్ష సభ్యులు సభా ప్రాంగణంలోనే నిరసనకు దిగారు. సీఎం భగవంత్మాన్ మరియు స్పీకర్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
Also Read : సీఎం చంద్రబాబు.. పవన్ క్లారిటీ.. లోకేష్ మౌనం..!
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్లోకి దూసుకెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి భగవంత్మాన్ మద్యం అలవాటుపై గతంలోనూ అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఒకసారి విమాన ప్రయాణంలో మద్యం మత్తులో ఉన్నారన్న కారణంతో ఆయనను కిందికి దించేశారనే వార్తలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే ఈ అంశం తెరపైకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దీనిని రాజకీయ కుట్రగా కొట్టిపారేస్తున్నారు.

