అమెరికాలో స్థిరపడాలని, సాఫ్ట్వేర్ ఉద్యోగంతో డాలర్లు సంపాదించాలని కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ట్రంప్ సర్కార్.. తాజాగా ప్రవేశపెట్టిన ఎండ్ హెచ్-1బి వీసా అబ్యూస్ యాక్ట్ 2026 బిల్లు భారతీయుల పాలిట మరణశాసనంగా మారబోతోంది. ఈ బిల్లు ప్రకారం, కొత్త హెచ్-1బి వీసాల జారీని వరుసగా మూడేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించారు. ఇది చట్టంగా మారితే, ఇప్పటికే హెచ్-1బి వీసా కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడటం ఖాయం.
Also Read : మంగ్లీ అండ్ టీమ్ చేసిన స్కామ్ ఏమిటీ..?
ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏటా ఇస్తున్న 65,000 వీసాల పరిమితిని ఏకంగా 25,000కు తగ్గించాలని నిర్ణయించారు. దీనివల్ల పోటీ విపరీతంగా పెరగడమే కాకుండా, వీసాలు లభించే అవకాశం నామమాత్రంగా మారుతుంది. వీటన్నింటికీ మించి, వీసా పొందే అభ్యర్థికి ఏడాదికి కనీసం 200,000 డాలర్లు అంటే.. సుమారు రూ. 1.67 కోట్లు వేతనం ఉండాలని నిబంధన విధించడం భారతీయ ఐటీ కంపెనీలకు పెను భారంగా మారనుంది. ఇంత భారీ జీతం ఆరంభ స్థాయి ఉద్యోగులకు ఇవ్వడం కంపెనీలకు సాధ్యం కాకపోవచ్చు, తద్వారా భారతీయ టాలెంట్ ను అమెరికా పక్కన పెట్టే ప్రమాదం ఉంది.
Also Read : అనంతబాబు అజ్ఞాతం మిస్టరీ వెనుక టిడిపి ఎమ్మెల్యే..?
ఇక ఇప్పటివరకు అనుసరిస్తున్న కంప్యూటరైజ్డ్ లాటరీ విధానానికి కూడా ఈ బిల్లు స్వస్తి పలికింది. కేవలం అత్యధిక వేతనం పొందే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కూడా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. దీనివల్ల అమెరికాలో దశాబ్దాలుగా ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న భారతీయుల ఆశలు అడియాశలు కానున్నాయి. అటు విద్యార్థులకు కూడా ఓపీటీ రద్దు వంటి ప్రతిపాదనలతో ట్రంప్ టీమ్ షాక్ ఇచ్చింది. వెరసి, ఈ కొత్త బిల్లు భారతీయ ఐటీ రంగానికి మరియు విద్యార్థులకు పెను సవాలుగా మారింది.

