డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉచ్చు మరింత బిగుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న ఆయన, కేసును నీరుగార్చేందుకు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులు నేడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులను అనంతబాబు ప్రత్యక్షంగా కలిశారని, ఒక్కొక్కరికి భారీగా డబ్బు ఆశ చూపారని తెలుస్తోంది. దానికి ఒప్పుకోని పక్షంలో ప్రాణాలతో ఉండరంటూ హెచ్చరించడంతో, భయపడిన సాక్షులు కాకినాడ పోలీసులను ఆశ్రయించారు.
Also Read : మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
వారి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు అనంతబాబుపై కొత్తగా క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు నమోదైన విషయం తెలుసుకున్న అనంతబాబు వెంటనే పరారయ్యారు. దీంతో పోలీసులు ఆయన కోసం ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నేటి ఉదయం అందిన సమాచారం ప్రకారం, అనంతబాబు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ బృందాలు హైదరాబాద్, ఒడిశా మరియు తమిళనాడు రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లాయి. ఆయన ఎక్కడ తలదాచుకున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
Also Read : నయా రథసారధి.. ముహూర్తం ఫిక్స్..!
ఆయనకు ఎవరైనా ఆశ్రయం కల్పించినట్లు తెలిస్తే, వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తామని పోలీసులు నేడు హెచ్చరికలు జారీ చేశారు. అనంతబాబు నుంచి తమకు ప్రాణహాని ఉందన్న సాక్షుల అభ్యర్థన మేరకు పోలీసులు నేడు వారికి ప్రత్యేక భద్రత కల్పించారు. సాక్షుల నివాసాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, వారి ప్రతి కదలికపై నిఘా ఉంచారు. ఒకవైపు పోలీసులు అనంతబాబు కోసం గాలిస్తుండగా, మరోవైపు సాక్షులను ప్రభావితం చేసినందున ఆయన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే అనంతబాబు మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

