రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఒకప్పుడు కేవలం విరాట్ కోహ్లీ మీద ఆధారపడే జట్టు. కానీ గత ఏడాది ఐపీఎల్ నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఇప్పుడు ఒక సరికొత్త విన్నింగ్ మెషిన్ లా మారింది. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ సాధించిన విజయం, పాటిదార్ నాయకత్వ పటిమకు అద్దం పడుతోంది. గత సీజన్ లో ఆర్సీబీకి చారిత్రాత్మక టైటిల్ ను అందించిన పాటిదార్, ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు.
Also Read : ఎంపీ మిథున్ రెడ్డిది అహంకారమా.. సమాచార లోపమా?
లక్నోతో జరిగిన మ్యాచ్ లో అతను తీసుకున్న నిర్ణయాలు విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచాయి. టాస్ గెలిచిన దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటి.. పాటిదార్ పక్కా ప్లానింగ్ తో వెళ్ళాడు. కీలక సమయాల్లో బౌలర్లను మారుస్తూ ఎల్ఎస్జీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడం అతని కెప్టెన్సీ స్కిల్ కు స్పష్టమైన ఉదాహరణ. విరాట్ కోహ్లీ వంటి సీనియర్ల సూచనలు తీసుకుంటూనే, మైదానంలో చురుకైన నిర్ణయాలతో జట్టును నడిపిస్తున్నాడు. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు, బ్యాటర్ గా కూడా పాటిదార్ దుమ్మురేపుతున్నాడు. కీలకమైన సమయంలో జట్టును ఆదుకుంటున్నాడు ఈ యంగ్ కెప్టెన్.
Also Read : మయాంక్ యాదవ్ ఈజ్ బ్యాక్..?
ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 222 పరుగులు చేసిన పాటిదార్, 213కు పైగా స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్లో కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో ఉందంటే అది పాటిదార్ అంటున్నారు ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ పక్కన ఉన్నప్పుడు ఏ కెప్టెన్ అయినా ఒత్తిడికి లోనవుతాడు. కానీ పాటిదార్ మాత్రం కోహ్లీ అనుభవాన్ని వాడుకుంటూనే, తనదైన మార్క్ కెప్టెన్సీని చూపిస్తున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, గడ్డు కాలంలో జట్టును వెన్నుతట్టి నడిపించడం పాటిదార్ ప్లస్ పాయింట్స్.

