గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ముసుగులో భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారని సంచలన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం రూ. 20.37 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు స్పష్టమైంది. ముఖ్యంగా క్రీడా సామగ్రి కొనుగోలులో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని విజిలెన్స్ విభాగం పేర్కొంది.
Also Read : బ్రేకింగ్: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్
నాసిరకం బ్యాట్లు, బాల్స్, కిట్లను అత్యధిక ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని వెల్లడించింది. నాణ్యత లేని వస్తువులు సరఫరా అవుతున్నాయని తెలిసినా, అప్పటి ఉన్నతాధికారులు మరియు రాజకీయ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని నివేదికలో వివరించారు. ఈ కుంభకోణంలో అప్పటి పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అలాగే అప్పటి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలదే ప్రధాన పాత్ర అని విజిలెన్స్ విభాగం తేల్చిచెప్పింది.
Also Read : శాంతి వెనుక.. ఇద్దరు మాజీ మంత్రులు..? బయటకు తీసుకురావడానికి కష్టాలు..!
వీరిద్దరి కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ నుండి నిధుల చెల్లింపుల వరకు అంతా అక్రమంగా సాగిందని పేర్కొంది. ఈ మేరకు వారిద్దరిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి బలమైన సిఫార్సు చేసింది. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, ఈ స్కామ్ లోని లోతైన మూలాలను వెలికితీయడానికి ఏసీబీ లేదా సీఐడీతో సమగ్ర విచారణ జరిపించాలని విజిలెన్స్ సూచించింది. క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, ప్రజాధనాన్ని దోచుకున్న బాధ్యుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని నివేదికలో స్పష్టం చేసింది.

