పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఒక అరుదైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉండే పార్టీల నేతలు ఒకే వేదికపై కనిపించడమే కాకుండా, ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. దెందులూరు మండలం కొవ్వలి ప్రభుత్వ పాఠశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కలిసి ఆవిష్కరించారు.
Also Read : డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు షాక్..!
ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీంద్రబాబు మాట్లాడుతూ చింతమనేని ప్రభాకర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం చింతమనేని ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్సీ కొనియాడారు. “చింతమనేని ప్రభాకర్ వెనుకబడిన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయనను మంత్రి పదవిలో చూడాలని నియోజకవర్గంలోని ఎంతోమంది కోరిక.
Also Read : తిరుమలలో ఆ దర్శనం రద్దు..!
ఆ కోరిక త్వరలోనే నెరవేరాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను” అని రవీంద్రబాబు పేర్కొనడం విశేషం. వైసీపీ ఎమ్మెల్సీ అయి ఉండి, టీడీపీ ఎమ్మెల్యేను.. అది కూడా మంత్రి కావాలని బహిరంగంగా కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో చింతమనేని శైలిని తీవ్రంగా విమర్శించిన రవీంద్రబాబు, ఇప్పుడు అదే నాయకుడిని ప్రశంసించడం వెనుక ఏవైనా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొనగా వారి ముందు ఈ వ్యాఖ్యలు చేసారు.

