ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. తన భార్య లక్ష్మీదుర్గకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెను కేసు నుంచి తప్పించాలని కోరుతూ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ కేసులో ఆయన భార్య కూడా నిందితురాలిగానే కొనసాగనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను అనంతబాబు హత్య చేసి, ఆపై ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Also Read : బ్రేకింగ్: టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్
ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ఏ1గా, ఆయన భార్య లక్ష్మీదుర్గను ఏ2గా పోలీసులు చేర్చారు. అయితే, నేరంలో తన భార్య ప్రమేయం లేదని, కేవలం రాజకీయ కారణాలతోనే ఆమెను ఇరికించారంటూ అనంతబాబు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు బలమైన వాదనలు వినిపించారు. హత్య జరిగిన సమయంలో మరియు ఆ తర్వాత ఆధారాల మరుగున పరిచే క్రమంలో ఏ2గా ఉన్న అనంత బాబు భార్య.. పాత్రపై ఉన్న ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : తిరుమలలో ఆ దర్శనం రద్దు..!
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తూ అనంతబాబు విన్నపాన్ని తోసిపుచ్చింది. అటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం గత కొంతకాలంగా న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది. అధికార పార్టీ నేత కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని గతంలో ఆరోపణలు కూడా చేసారు. అయితే, తాజా కోర్టు నిర్ణయంతో ఈ కేసులో విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామం అనంతబాబు కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు

