భారత ఎన్నికల వ్యవస్థలో విమర్శలకు వేదికగా మారిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈవీఎంలపై సాంకేతిక విచారణ చేపట్టాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దేశ చరిత్రలో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై ఇలాంటి డయాగ్నస్టిక్ పరీక్షలు జరగడం ఇదే మొదటిసారి. మహారాష్ట్రలోని చాందివాలి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థి ఆరిఫ్ నసీమ్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం
అక్కడ శివసేన (ఏకనాథ్ షిండే వర్గం) అభ్యర్థి దిలీప్ లాండే చేతిలో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ క్రమంలో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, జస్టిస్ సోమశేఖర్ సుందరేసన్ ఈ చారిత్రాత్మక ఆదేశాలను వెలువరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు చెందిన నిపుణులైన ఇంజనీర్లు ఈ సాంకేతిక తనిఖీలను నిర్వహిస్తారు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరిగే ఈ డయాగ్నస్టిక్ చెక్ ప్రక్రియలో ఫిర్యాదుదారు ఆరిఫ్ నసీమ్ ఖాన్ కూడా స్వయంగా హాజరుకానున్నారు.
Also Read : వైజాగ్: నెక్స్ట్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా
ఈ పరీక్షల ద్వారా ఈవీఎంలలోని డేటా, మెషీన్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంలపై విమర్శలు రావడం సహజం. అయితే, నేరుగా హైకోర్టు జోక్యం చేసుకుని టెక్నికల్ చెకప్ కు ఆదేశించడం అనేది ఎన్నికల వివాదాల పరిష్కార ప్రక్రియలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ పరీక్షల ఫలితాలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ మరియు ఈవీఎంల విశ్వసనీయతపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.

