మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భారీ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత ఖరీదైన, అత్యాధునిక నిఘా విమానం MQ-4C ట్రైటన్ హార్ముజ్ జలసంధిపై ఎగురుతూ అకస్మాత్తుగా అదృశ్యమైంది. సుమారు 1.4 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.12,000 కోట్లు విలువైన ఈ డ్రోన్ నుంచి చివరి నిమిషంలో ఎమర్జెన్సీ అలర్ట్ రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్ ఫ్లైట్ రాడార్ 24 అందించిన వివరాల ప్రకారం, ఈ డ్రోన్ ఇటలీలోని నావల్ ఎయిర్ స్టేషన్ సిగోనెల్లా నుండి బయలుదేరింది.
Also Read : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏపీ సర్కార్..!
దాదాపు మూడు గంటల పాటు పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిపై నిఘా పూర్తి చేసిన తర్వాత, ఇది తిరిగి తన బేస్ కు వెళ్లాల్సి ఉంది. అయితే, అకస్మాత్తుగా ఇరాన్ వైపు స్వల్పంగా మలుపు తీసుకున్న తరుణంలో డ్రోన్ నుంచి కోడ్ 7700 అంటే.. జనరల్ ఎమర్జెన్సీ సిగ్నల్ వెలువడింది. ఆ వెంటనే అత్యంత వేగంగా ఎత్తును కోల్పోతూ రాడార్ స్క్రీన్ల నుండి ఈ విమానం మాయమైపోయింది. MQ-4C ట్రైటన్ అనేది అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది. ఇది 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ, ఒకే రోజులో 70 లక్షల చదరపు కిలోమీటర్ల సముద్ర ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు.
Also Read : వైఎస్ఆర్ మరణానికి జగనే కారణం..!
ఇందులోని అత్యాధునిక సెన్సార్లు, రాడార్లు సముద్రంపై జరిగే ప్రతి చిన్న కదలికను పసిగట్టగలవు. ఇంతటి భారీ నిఘా యంత్రాంగం అదృశ్యం కావడం అమెరికాకు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీని శిథిలాలు లేదా టెక్నాలజీ శత్రువుల చేతికి చిక్కితే అది అమెరికా భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ ఘటన వెనుక ఇరాన్ హస్తం ఉందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. 2019లో కూడా ఇరాన్ ఇలాగే ఒక అమెరికా గ్లోబల్ హాక్ డ్రోన్ను కూల్చివేసింది. తాజా ఘటనలో డ్రోన్ అకస్మాత్తుగా ఇరాన్ వైపు తిరగడం చూస్తుంటే, దాని సిగ్నల్స్ను ఎవరైనా హ్యాక్ చేశారా అనే కోణంలో చర్చ మొదలైంది.

