పార్టీ కేడర్ను పట్టించుకోని నేతలపై టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పలువురు ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత నాలుగు వారాలుగా నియోజకవర్గాల్లో కేడర్ సమావేశాలు, గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించని నేతలను లోకేష్ నేరుగా నిలదీశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడిన నేతల పేర్లను ప్రస్తావిస్తూ లోకేష్ చురకలు అంటించారు. ఇందులో సీనియర్ నేతలు ఉండటం గమనార్హం.
Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!
మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, ముఖ్య నేతలు.. పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ లపై లోకేష్ అసహనం వ్యక్తం చేసారు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదో కారణాలు అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని లోకేష్ ఆదేశించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేడర్ను, ప్రజలను ఇంకా ఎక్కువగా పట్టించుకోవాలని స్పష్టం చేసారు.
Also Read : పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!
బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇకపై ఉపేక్షించేది లేదన్నారు. కార్యకర్తల సమస్యలు వినడానికి ప్రతి వారం గ్రీవెన్స్ నిర్వహించాలని, నియోజకవర్గ స్థాయి సమావేశాలను క్రమం తప్పకుండా జరపాలని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటినా లేదా పనితీరు మెరుగుపరుచుకోకపోయినా కఠిన చర్యలు తప్పవని ఆయన సంకేతాలిచ్చారు. ఇటీవలి కాలంలో లోకేష్ పలుమార్లు పార్టీ నేతలను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. గ్రీవెన్స్ విషయంలో పలువురు నేతల తీరు వివాదాస్పదంగా మారుతోన్న నేపధ్యంలో.. లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

