ఐపీఎల్ 2026లో మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్ గా మలిచి, క్రికెట్ ఫ్యాన్స్ ను షాక్ గురి చేసాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు మ్యాచ్ ను కుదించగా.. వైభవ్, జైస్వాల్ జోడి దూకుడుకు.. ఏకంగా రాజస్థాన్ 150 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో వైభవ్ ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది.
Also Read : బుమ్రా వర్సెస్ వైభవ్.. ఐపిఎల్ లో ఇంట్రస్టింగ్ పోరు..!
క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే అతను దూకుడుగా ఆడాడు. ఏమాత్రం బెరుకు లేకుండా ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించిన ఈ కుర్రాడు, అందులో 5 భారీ సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బంతులను అలవోకగా ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్లు కొట్టడం చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం నోరెళ్లబెట్టారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో వైభవ్ స్ట్రైక్ రేట్ 248.97 ఉండటం విశేషం. వేలంలో కేవలం రూ. 1.10 కోట్లకు దక్కిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు ప్రధాన అస్త్రంగా మారాడు.
Also Read : పంతం నెగ్గించుకున్న ఇరాన్.. లాస్ట్ మినిట్ తగ్గిన ట్రంప్..!
ఓపెనర్ గా వచ్చి పవర్ ప్లేలో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్లో అతను అందించిన మెరుపు ఆరంభం వల్లే రాజస్థాన్ జట్టు భారీ స్కోరు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కేవలం 15 ఏళ్ల వయసులో అతని సిక్స్ హిట్టింగ్ సామర్ధ్యం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా బుమ్రా బౌలింగ్ లో నిలబడటమే కష్టం అని భావిస్తూ ఉంటారు. అలాంటిది వైభవ్ ఏకంగా అతని ఓవర్లోనే భారీ సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా కూడా వైభవ్ బ్యాటింగ్ ను ప్రశంసించడం గమనార్హం.

