ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తుకు సంబంధించి నేడు కీలక, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘ఏపీ చట్ట సవరణ బిల్లు’ను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై చర్చ జరగనుండటంతో అటు ఢిల్లీలోనూ, ఇటు ఏపీలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొన్నేళ్లుగా రాజధాని మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి మనుగడపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
Also Read : దుమారం రేపుతున్న కాగ్ నివేదిక..!
ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నేడు లోక్ సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, అమరావతికి న్యాయపరమైన రక్షణ లభించడంతో పాటు, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లుపై జరిగే చర్చలో భాగంగా టీడీపీ తరపున ఐదుగురు ఎంపీలు తమ గళాన్ని వినిపించనున్నారు. అమరావతి ఆవశ్యకతను, గత ఐదేళ్లుగా అక్కడి రైతులు పడిన ఇబ్బందులను వారు సభ దృష్టికి తీసుకురానున్నారు.
Also Read : ట్రంప్ నోటి దూల.. వాళ్ళు బానిసల బిడ్డలు అంటూ వివాదాస్పద కామెంట్..!
వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కూడా పార్లమెంట్ లో చర్చ జరగనుంది. అలాగే, జనసేన ఎంపీ బాలశౌరి కూడా ఈ చర్చలో పాల్గొని, అమరావతి అభివృద్ధికి ఈ చట్టబద్ధత ఎంత కీలకమో వివరించనున్నారు. మరోవైపు, ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉండటంతో, సభలో చర్చ ఆసక్తికరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం వెనుక అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను, పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం కూడా ఉంది. చట్టబద్ధత లభిస్తే ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు రావడం సులభతరం కానుంది.

