ఐపీఎల్ లో చెన్నై జట్టు తన పేలవ ఫాం కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది సీజన్ లో ఘోర ఓటములు మూటగట్టుకున్న చెన్నై జట్టు.. తాజాగా రాజస్థాన్ చేతిలో అదే స్థాయిలో ఫెయిల్ కావడం విమర్శలకు దారి తీస్తోంది. సోమవారం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో సిఎస్కే తన స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ విఫలమై, చివరకు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
Also Read : ఏపీలో ముగిసిన మావోల శకం.. ఆపరేషన్ కగార్ సక్సెస్..!
ఈ ఘోర పరాజయంపై సిఎస్కే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే కనీసం పోరాటం కూడా చేయకుండానే కుప్పకూలింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (6), సంజూ శాంసన్ (6) కేవలం ఆరు పరుగులకే వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. మొత్తం 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది. జేమీ ఓవర్టన్ చేసిన 43 పరుగులు మినహా మిగిలిన బ్యాటర్లందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా బౌలింగ్ దెబ్బకు చెన్నై విలవిలలాడింది.
Also Read : నాయుడుపై వేటు.. కొత్తగా సీనియర్ నేత..!
కనీసం 150 పరుగులు కూడా చేయలేకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో సిఎస్కే బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ తరపున కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది సిఎస్కే బౌలర్లను ఉతికి ఆరేశాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి అతను చేసిన విధ్వంసంతో రాజస్థాన్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సిఎస్కే బౌలర్లు ఎక్కడా పోరాటం చేసినట్టు కనపడకపోవడం గమనార్హం. ముఖ్యంగా సంజూ శాంసన్ తన డెబ్యూ మ్యాచ్లోనే నిరాశపరచడం, ఎంఎస్ ధోని లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండటంతో జట్టు కూర్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

