పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతోన్న సమయంలో, ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంతో అల్లాడుతుంటే, భారత్ కు మాత్రం ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చింది. నేడు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన అధికారిక ప్రకటనతో భారత్ కు ఊరట లభించినట్లు అయింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగిస్తోంది ఇరాన్.
Also Read : ఒకప్పుడు రాజస్థాన్ ప్లేయర్.. ఇప్పుడు ఆర్సీబీ బాస్..!
ఇదే సమయంలో.. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాక్ వంటి మిత్రదేశాల నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. భారత నౌకలు ఇరాన్ రక్షణ బలగాల సమన్వయంతో, భద్రతా నిబంధనలకు లోబడి ఈ మార్గం గుండా వెళ్ళవచ్చని స్పష్టం చేసింది. భారత్ కు అవసరమైన ఎల్పిజి లో 90%, ముడి చమురులో దాదాపు 40% ఈ మార్గం ద్వారానే వస్తుంది. తాజా నిర్ణయంతో దేశంలో ఇంధన సరఫరా మరింత వేగవంతం కానుంది. కొన్నేళ్ల విరామం తర్వాత, నేడు భారత్.. ఇరాన్ నుండి ఎల్పిజి కార్గోను కొనుగోలు చేసింది.
Also Read : పీవీ సునీల్ కుమార్ మతం వివాదం.. ముదురుతున్న కుల రచ్చ.. !
ఇది మంగళూరు ఓడరేవుకు చేరుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నా, భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడం గమనార్హం. అయితే, ఈ యుద్ధ వాతావరణం వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగే అవకాశం ఉండటంతో విమాన టికెట్ల ధరలు ఇప్పటికే పెరిగాయి. ఇరాన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం కేవలం చమురు సరఫరాకే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత్ దౌత్య బలాన్ని కూడా నిరూపించిందని నిపుణులు అంటున్నారు.

