అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్.. మధ్య యుద్ధం ఇప్పుడు గేర్ మారింది. నిన్న సాయంత్రం నుంచి దాడుల తీవ్రత భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా చెప్తోంది. దీనితో గల్ఫ్ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. ఒకవైపు యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం బాంబుల వర్షం ఆగడం లేదు. ట్రంప్ తగ్గినా ఇజ్రాయెల్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్, లెబనాన్ లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది.
Also Read : సుప్రీం తీర్పు.. వారికి కూడా వర్తిస్తుందా..?
ముఖ్యంగా ఇరాన్ రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల వల్ల ఇరు దేశాల్లో భారీ నష్టం జరుగుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్ ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం.. ఎదురుదాడిలో ఇరాన్ మరింత తీవ్రంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : బ్రేకింగ్: డేంజర్ జోన్ లో బెజవాడ..? అసలేం జరుగుతోంది..?
పర్షియన్ గల్ఫ్ దిశగా వేలమంది అమెరికా సైనికులు వేగంగా తరలివెళ్ళడం యుద్ధం తీవ్రత మరింత పెంచింది. అమెరికా తన పూర్తి సైనిక బలాన్ని ఇక్కడ మొహరిస్తుండటంతో, ఇది కేవలం హెచ్చరికకే పరిమితం కాకుండా నేరుగా యుద్ధంలోకి దిగే సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు చర్చలు అంటున్న ట్రంప్, మరోవైపు అమెరికా సైన్యాన్ని భారీగా తరలించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇరాన్ ను లొంగదీసుకోవడానికే ఈ ఒత్తిడి పెంచుతున్నారా? లేక ఇది పూర్తిస్థాయి ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతోందా? అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.

