అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ప్రభుత్వం వీటిని కేవలం ప్రమాదాలుగా కాకుండా, విద్రోహ చర్యలుగా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నిర్మాణ పనులు జరుగుతున్న కీలక ప్రాజెక్టు ప్రాంతాల్లోనే ఈ ప్రమాదాలు సంభవించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ రాజధాని వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఇటీవల ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన పైపులు దగ్ధం కాగా, తాజాగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన భారీ పైపులకు మంటలు అంటుకున్నాయి.
Also Read : సుప్రీం తీర్పు.. వారికి కూడా వర్తిస్తుందా..?
ఈ రెండు ఘటనల్లోనూ కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. సాధారణంగా ఈ నిర్మాణ పనులకు ఉపయోగించే పైపులు అత్యంత నాణ్యమైనవి. సుమారు 130 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఇవి దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ ఎండలకు లేదా చిన్నపాటి నిప్పురవ్వలకు ఇవి కాలిపోవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఎవరో కావాలనే రాజధాని పనులకు ఆటంకం కలిగించేందుకు ఈ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : అమెరికా గడ్డపై ఇరాన్ దాడి..? అమెరికన్లలో వణుకు మొదలు..!
ప్రమాదం జరిగిన ప్రాంతాల నుండి ఫోరెన్సిక్ బృందాలు నమూనాలను సేకరించాయి. మంటలు అంటుకోవడానికి ఏదైనా రసాయనాలను వాడారా..? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలాల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల సంచారంపై దృష్టి సారించారు. రాజధాని ప్రాంతంలోని నిర్మాణ సామాగ్రి నిల్వ కేంద్రాలు, యంత్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు పోలీసు పెట్రోలింగ్ ను కూడా పెంచారు. రాజధాని అమరావతి పనులు వేగవంతం అవుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడంపై రాజకీయంగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

