త్వరలో రాజ్యసభ ఎన్నికలకు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ, బీఆర్ఎస్ తరఫున కేఆర్ సురేశ్ రెడ్డి పదవీకాలం ముగియనున్నందున ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీలో ఉన్న పార్టీల సంఖ్యాబలం ఆధారంగా.. అధికార కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలను దక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. అభిషేక్ సింఘ్వీని మరోసారి నామినేట్ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రెండో స్థానం నుంచి గతంలో ఉప రాష్ట్రపతిగా పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని పోటీలో నిలబెట్టాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read : చెవిరెడ్డిని ఊహించని దెబ్బ కొట్టిన జగన్..!
అదే సమయంలో, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా రాజ్యసభ రేసులో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాన్ని అంచనా వేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు అసెంబ్లీలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారిలో దాదాపు 10 మంది బీఆర్ఎస్కు దూరంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నారు. అయితే వారిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్కు కొంత దూరంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత అసెంబ్లీలో లెక్కల ప్రకారం, రాజ్యసభ ఎన్నికల్లో అర్హత కలిగిన 119 మంది సభ్యులు తమ ఓటు వేస్తే, గెలుపు కోటా దాదాపు 40.66 ఓట్లు అవుతుంది. అంటే ప్రతి అభ్యర్థి విజయం సాధించడానికి కనీసం 41 ఓట్లు అవసరం. రెండు స్థానాలను గెలవడానికి మొత్తం 82 ఓట్లు అవసరం.
రాజ్యసభ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టాలా.. వద్దా.. అనే దానిపై కేసీఆర్ తీసుకునే నిర్ణయం రాజకీయ వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ వర్తిస్తుంది. ఎమ్మెల్యేలు తమ గుర్తు పెట్టబడిన బ్యాలెట్లను అధికారిక పార్టీ ఏజెంట్లకు తప్పనిసరిగా చూపించాలి. దీని ద్వారా క్రాస్ ఓటింగ్ అంశం స్పష్టం అవుతుంది. ఇది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వైఖరిని బహిర్గతం చేస్తుంది. తుది ఫలితం ఎలా ఉన్నా, ఫిరాయింపు శాసనసభ్యులను బహిరంగంగా గుర్తించడానికి కేసీఆర్ ఈ ఎన్నికలను ఉపయోగించుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉంటే, కోటా సీటుకు దాదాపు 38 ఓట్లకు పడిపోతుంది. రెండు స్థానాలకు 76 ఓట్లు అవసరం.
Also Read : స్టేజి పైనే వరలక్షి శరత్ కుమార్ కన్నీటి కృతజ్ఞత
తమ పార్టీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు మజ్లీస్ సభ్యులు, ఒక సీపీఐ సభ్యుడితో కలిపి కాంగ్రెస్కు మొత్తం 74 ఓట్లు ఉంటాయి. రెండు స్థానాలు గెలవాలంటే అవసరమైన సంఖ్యకు ఇంకా 2 తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో.. రెండవ ప్రాధాన్యత ఓట్లు, తొలగింపు ప్రక్రియ కీలకంగా మారుతుంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్ల ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా మారిన అంశం. వీలైతే రాజ్యసభ గెలుపు. లేదా ఫిరాయింపు ఎమ్మెల్యేలను బహిర్గతం చేసి.. రాజకీయంగా వారిని ఇబ్బందులకు గురి చేయడం అనేది కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు సన్నిహితులు. అయితే బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలా.. వద్దా.. అనే దానిపై తుది నిర్ణయం కేసీఆర్దే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

