తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవో ఖరారు అయ్యారా..? ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడుతుందా..? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బాగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఈవో అనిల్ సింఘాల్పై బదిలీ వేటు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఆయన స్థానంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన అధికారిని నియమించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా టీటీడీపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల దివ్యక్షేత్రం కొద్ది రోజులుగా వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీరు వివాదాలకు కారణమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు తిరుమల ప్రతిష్ఠను మంటగలిపాయి. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సిట్ బృందం కోర్టుకు రిపోర్టు కూడా అందించింది. పాలు, పెరుగు లేకుండానే రసాయనాల ద్వారా నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి సరఫరా చేశారని సిట్ అధికారులు తేల్చేరు.
Also Read : బ్రేకింగ్: కేసీఆర్ కు సిట్ నోటీసులు
కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే సిటి అధికారులు పలువురిని అరెస్టు చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఇంఛార్జ్ ఈవోగా పని చేసిన ధర్మారెడ్డిని కూడా విచారించారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏడాది పాటు ఈవోగా కొనసాగిన అనిల్ కుమార్ సింఘాల్పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అక్రమాలు జరిగాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సింఘాల్ను మళ్లీ టీటీడీ ఈవోగా నియమించడాన్ని కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీంతో టీటీడీలో పరిస్థితులు చక్కబెట్టేందుకు, వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను బదిలీ చేసి.. ఆయన స్థానంలో తాత్కాలికంగా సీఎంఓ అధికారి ముద్దాడ రవిచంద్రను నియమించాలని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్ల సమయంలో సాయిప్రసాద్తో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. నిజానికి చంద్రబాబు దావోస్ పర్యటన కంటే ముందే సింఘాల్ బదిలీ ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. కానీ.. రథసప్తమి వరకు తనను కొనసాగించాలని సింఘాల్ స్వయంగా కోరినట్లు సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.
ముద్దాడ రవిచంద్రను తాను సీఎంగా ఉన్నంతకాలం సీఎంఓలోనే కొనసాగించాలని గతంలోనే చంద్రబాబు ఆదేశించారు. అందుకే తాజాగా టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు మాత్రమే అప్పగించేలా ఉత్తర్వులు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇలా చేయటం వల్ల సీఎంఓ నేరుగా టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల టీటీడీ అధికారులు, ఉద్యోగుల్లో భయం ఉంటుందనేది సీఎంఓ వర్గాల మాట.
Also Read : పెద్దల సభకు లోకేష్ ఆప్తుడు..!
ఇక అసలు విషయం ఏమిటంటే.. టీటీడీ కల్తీ నెయ్యి కుంభకోణంలో సింఘాల్ పాత్ర ఎంత వరకు ఉందనే అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. అప్పట్లో కూడా ఈవోగా సింఘాల్ ఉన్నారు. కొత్త టెండర్లు ఆమోదించే వివరాలను టీటీడీ బోర్డులో పెట్టారు. బోర్డు సమావేశాల్లో ఈవో హోదాలో సింఘాల్ పాల్గొన్నారు. బోర్డు సభ్యుల ఆమోదం అనంతరం సంబంధిత ఫైలు పై సంతకం కూడా చేశారనేది సింఘాల్ పై ప్రధాన ఆరోపణ. కల్తీ నెయ్యి కుంభకోణంలో ఇప్పటికే చాలా మందిని విచారించిన సిట్ అధికారులు.. త్వరలో సింఘాల్ను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవోగా సింఘాల్ ను కొనసాగించటం సరికాదని సీఎం చంద్రబాబు బావించినట్లు తెలుస్తోంది. అందుకే వెంటనే సింఘాల్ను బదిలీ చేయమని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఏదీ ఏమైనా సిట్ విచారణలో కల్తీ నెయ్యి కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

