అమరావతి రైతులు, ఐఏఎస్ అధికారుల పట్ల కూటమి వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు మాటలకు రైతులు, అధికారులు మైమరచి పోయారనే మాట కూడా వినిపిస్తోంది. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు, ఫ్లాట్ల కోసం ఎనిమిదేళ్ల కిందట లక్షలు కట్టిన ఐఏఎస్ అధికారులు ఇప్పటి వరకు మౌనంగా ఉన్నారు. అయితే ఈ మౌనం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైతుల, అధికారుల నమ్మకానికి తూట్లు పొడుస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో మోసపోతుంది ఎవరనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.
అసలు విషయం ఏమిటంటే.. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చుని 18 నెలలు గడిచింది. అయినా సరే.. ఇప్పటి వరకు అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లు, ఇప్పటికీ ఏ ఒక్కరికి అభివృద్ధి చేసి ఇవ్వలేదు. మరో రెండేళ్లకైనా ఇస్తారన్న నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఇచ్చే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించటం లేదని రైతులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ శాఖ మంత్రిగా నారాయణ, సీఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు ఉన్నంత కాలం 30 అడుగులు ముందుకు పడితే, 300 అడుగులు వెనుకకు పడుతున్నాయంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. అమరావతి జేఏసీ నాయకులకు నామినేటెడ్ పోస్టులు దక్కటంతో ఇప్పుడు వాళ్లు కూడా సైలెంట్గా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read : ఏపీలో సీనియర్ల వైరాగ్యం.. రాజకీయాలకు గుడ్ బై..?
వైసీపీ పాలనలో రైతుల గోడు వినిపించిన నేతలంతా.. ఇప్పుడు కనీసం ఆ రైతుల ప్లాట్ల గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కొంతమంది అయితే అమరావతి గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో రైతులంతా రోడెక్కారు. కుల, మతాలకు అతీతంగా వైసీపీ తీరును ఎండగట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. నాటి జేఏసీ నేతలకు పదవులు వచ్చాయి. పదవులు రావడంతోనే రైతులను మర్చిపోయారనే ఆరోపణలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.
రాజధానిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయనే మాట బాగా వినిపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. నిజానికి శరవేగంగా జరుగుతున్నవి కేవలం రహదారి నిర్మాణ పనులు మాత్రమే. సచివాలయం, హైకోర్టు, ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణాలు నత్తతో పోటీ పడుతున్నాయి. సీఆర్డీఏలో కొలువైన ప్రైవేటు ఏజెన్సీలు కూడా అమరావతి ఆహా, ఓహో అంటూ పాత వీడియోలు, ఫోటోలు తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నాయి. విజయవాడ వెస్ట బైపాస్ కోసం కృష్ణా నదిపై నిర్మించిన 3 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జిని బాహుబలి బ్రిడ్జి అంటూ సీఆర్డీఏ పదే పదే ప్రచారం చేస్తూ.. క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. నిజానికి అది సీఆర్డీఏ నిర్మించిన బ్రిడ్జ్ కాదు. అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జ్. కానీ అది రాజధాని కోసమే కట్టినట్లు ప్రజలను నమ్మించడానికి సీఆర్డీఏ తెగ పాట్లు పడుతోంది.
Also Read : పాదయాత్ర దిశగా బీఆర్ఎస్ అడుగులు..? చేసేది ఎవరు..?
రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేయటంలో సీఆర్డీఏ అధికారులు తీవ్ర జాప్యం చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ సంగతిని అసలు పట్టించుకోవటం కూడా లేదు. ఒకరిద్దరు రైతులు గట్టిగా మాట్లాడితే.. వాళ్లు రాజధాని వ్యతిరేకం అనే ముద్ర వేస్తున్నారనేది రైతుల ఆవేదన. ప్లాట్ల కోసం సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన భూములిచ్చిన రైతులకు కనీస సమాధానం కాదు కదా.. గౌరవం కూడా ఇవ్వటం లేదు. 2019 ఎన్నికల కంటే ముందు పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ప్లాట్ల కోసం ఏకంగా 25 లక్షల రూపాయలు కట్టారు. వాళ్లకు కూడా ఇప్పటి వరకు ఆ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారనే సమాధానం కూడా చెప్పటం లేదు. దీంతో ఐఏఎస్లకే దిక్కు లేదు.. ఇంక సామాన్య రైతుకు జవాబు చెప్తారా అనే మాట బాగా వినిపిస్తోంది.
కన్నబాబును కమిషనర్ స్థానం నుంచి వెంటనే తప్పించాలనేది అమరావతి ప్రాంత రైతుల డిమాండ్. అమరావతిలో అద్బుతం అంటూ సోషల్ మీడియా ప్రైవేటు ఏజెన్సీలతో ప్రచారం చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఆర్డీఏ నిర్వహిస్తున్న ప్రజా రాజధాని సోషల్ మీడియాలో అకౌంట్లో ఏఐ వీడియోలు పోస్టు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు ఉన్నంత కాలం.. అటు ఐఏఎస్ అధికారులకు, ఇటు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను అభివృద్ధి చేసి, ఇచ్చే అవకాశాలు కనుచుపు మేర కన్పించట లేదని అమరావతి రైతులు తమ భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.

