ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో భోగాపురం రన్ వై పైన తొలి విమానం ల్యాండ్ అవుతుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్టు కోసం నిర్మించిన రన్ వై పైన ప్రయాణించనున్నారు. భోగాపురం విమానశ్రయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంఆర్ రికార్డు సమయంలో పూర్తి చేసింది. 2026 జూన్ నాటికి భోగాపురం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ పనులు చేస్తోంది. దేశంలోనే రెండో అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా భోగాపురం రికార్డుల్లోకి ఎక్కనుంది. ఇక భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. విశాఖ నగరానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని.. ఇప్పటికే ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
Also Read : జగన్ కొత్త టార్గెట్.. ఆరు నెలలకు రూట్ మ్యాప్ రెడీ..?
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు 2015లోనే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా సబ్బవరం, అచ్యుతాపురం, కోరుప్రోలు వద్ద ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న ప్రాంతం కావడంతో పాటు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు మధ్య ప్రాంతంగా భోగాపురం ఎంపిక చేసారు. దీనికి సంబంధించి 2016లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది కూడా. 2017 ఆగస్టు నెలలోనే టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్ కూడా దాఖలు చేసింది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని అనుమతులు మంజూరు చేయడంతో 2019 ఫిబ్రవరి 14న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో 5,311 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. దీనిని పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్.. పీపీపీ విధానంలో నిర్మించేందుకు జీఎంఆర్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
అయితే భోగాపురం ఎయిర్పోర్టుకు భూమి కేటాయింపులపై నాటి ప్రజా సంకల్ప పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. భూ కేటాయింపుల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. భూ కేటాయింపులు రద్దు చేస్తామని కూడా అప్పట్లో బహిరంగంగానే ప్రకటించారు వైఎస్ జగన్. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు పనులకు బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఎయిర్పోర్టుకు కేటాయించిన భూముల్లో కోత విధించి కేవలం 2,200 ఎకరాల భూమి మాత్రమే జీఎంఆర్ సంస్థకు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం.. మిగిలిన 500 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనంలోనే ఉంచుకుంది. ఆ తర్వాత జీఎంఆర్ సంస్థతో పీపీపీ విధానంలో నిర్మించేందుకే జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఇక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 3వ తేదీన మరోసారి భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఎలాంటి ఆర్థిక కేటాయింపులు చేయలేదు. దీంతో నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత నిధులు మంజూరు చేయడంతో 2023 నవంబర్ నెలలో సివిల్ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంస్థ ప్రారంభించింది.
Also Read : బెజవాడ నుంచి అమరావతి వెళ్ళే వారికి గుడ్ న్యూస్..!
2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్ పోర్టుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. MRO.. మెయిన్టనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ సౌకర్యాలు ఉండాలని సూచించారు. దీంతో మరోసారి నిర్మాణ సంస్థ జీఎంఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. తాజాగా దీని పనులు తుది దశకు చేరుకున్నాయి. భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు జూన్ 2026 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే పని చేసిన జీఎంఆర్ సంస్థ రికార్డు సమయంలో పనులు పూర్తి చేసింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి బ్రేకులు వేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాడు.
వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్ధమైందని.. అప్పట్లో ప్రధాని మోదీతో సమావేశమై అన్ని అనుమతులు తెచ్చి.. రైతులకి పరిహారం, నిర్వాసితులకి పునరావాసంపై మానవతా దృక్పథంతో వ్యవహరించిన వైయస్ జగన్.. అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైయస్ జగన్ సంకల్పానికి నిదర్శనం అంటూ క్రెడిట్ కోసం వైసీపీ నేతలు వెంపర్లాడుతున్నారు. నిజానికి 2015లోనే పురుడుపోసుకున్న భోగాపురం ఎయిర్పోర్టుకు.. 2016లోనే డీపీఆర్ సిద్ధమైంది. 2018 నాటికి అన్ని అనుమతులు వచ్చాయి. అప్పట్లోనే ఈ నిర్మాణానికి జగన్ బ్రేకులు వేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ఇప్పుడు మర్చిపోయినట్లున్నారు. ఇప్పుడు క్రెడిక్ కోసం పాకులాడటం చూస్తుంటే అంతా ఆశ్చర్యపోతున్నారు.

