భారతీయులకు ఎంటర్టైన్మెంట్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సినిమా. భాష ఏదైనా సరే.. సినిమా ప్రేమికులున్నారు. సినీ నటులను ఆరాధిస్తారు. తమ అభిమాన హీరో సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. ఇక చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాను చూసే వాళ్లు కొందరున్నారు. ఇక తాజాగా సినిమా చూసే ముందు రేటింగ్, రివ్యూలపైన కూడా ఎక్కువగా చర్చించుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే క్రిటిక్స్ పేరుతో కొందరు ఆ సినిమాకు ఓ రేటింగ్ ఇస్తారు. అటు మీడియా, సినీ పత్రికలు కూడా ఇప్పుడు సినిమాలకు రివ్యూలు ఇస్తున్నాయి. వీటిల్లో కథ, కథనం, నటీనటుల అభినయం, ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. వీటి ఆధారంగానే సినిమాలకు రేటింగ్స్ ఇస్తారు కూడా. 5 స్టార్కు 3.75 వస్తే చాలు.. అది సూపర్ హిట్.. అదే 2.5 రేటింగ్ అయితే.. యావరేజ్. ఈ రేటింగ్ ఆధారంగా ఈ సినిమా థియేటర్లో చూడాలా.. లేక ఓటీటీలో చూడాలా అనేది సగటు ప్రేక్షకుడు ఇప్పుడు నిర్ణయించుకుంటున్నారు.
Also Read : ఇంత ధీమాతో ఎలా ఉన్నారు ధర్మారెడ్డి గారు..?
ఈ రేటింగ్ కేటాయింపులో అక్రమాలు అనే వార్త సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది. నిజానికి రేటింగ్, రివ్యూ అనేది ఇప్పుడు కొత్తగా ప్రారంభం కాలేదు. చాలా రోజులుగా సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్య. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. దానికి ప్రేక్షకుల ఆదరణ రావాలంటే మంచి మార్కులు పడాల్సిందే. అలా జరగాలంటే ఆ సినిమా నిర్మాత దక్షిణ సమర్పించుకోవాల్సిందే. లేదంటే.. సినిమాకు నెగిటివ్ రివ్యూలు, యావరేజ్, బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చేస్తారు. దాని ప్రభావం సినిమా కలెక్షన్ మీద పడుతుంది. థియేటర్లు ఖాళీ.. దీంతో నిర్మాత దివాళ. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే నిర్మాతలు క్రిటిక్స్, టికెట్ బుకింగ్ సంస్థలకు లంచాల రూపంలో లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. తాజాగా ఇదే విషయాన్ని ఓ సినీ నిర్మాత బహిరంగంగానే వెల్లడించారు. ఇలా లంచం ఇవ్వకపోతే.. సినిమాకు నెగిటివ్ మార్కులు వేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
Also Read : రాజు గారు.. కాస్త దూకుడు తగ్గించండి సార్..!
టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రివ్యూల వెనుక ఇంత పెద్ద స్కామ్ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కూడా. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీరజ్ మొగిలినేని సినిమా నిర్మాతలు పడుతున్న కష్టాలను వివరించారు. సినిమా హిట్ టాక్ వస్తే.. అది నిలబెట్టుకోవడానికి నిర్మాతలు ప్రతిరోజు రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో పైన సంచలన ఆరోపణలు చేశారు. అందులో సినిమాలకు ఇచ్చే రేటింగ్ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. బుక్ మై షోలో ఇస్తున్న రేటింగ్ ఆడియన్స్ ఇవ్వటం లేదన్నారు. ఆ సంస్థ తరఫున ఏజెంట్ నిర్మాతతో సంప్రదింపులు జరుపుతాడన్నారు. 2 లక్షల మందితో ఓటింగ్ వేయించడానికి, 9 రేటింగ్ కోసం రూ.5 లక్షలు ప్యాకేజ్ వసూలు చేస్తారంట. ఆ ప్యాకేజీ కూడా కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. 2 రోజుల తర్వాత రేటింగ్ 8.6కు పడేస్తారని.. అదేమని అడిగితే.. మీరు రెండు రోజులకే ఇచ్చారు.. ఇప్పుడు సినిమాకు నెగిటివ్ రేటింగ్స్ వస్తున్నాయని బెదిరిస్తారట. నిజానికి నెగిటివ్ రేటింగ్ ఎవరూ ఇవ్వరని.. నిర్మాతను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు సంస్థ ప్రతినిధులే ఇలా చేస్తారని ఆరోపించారు. సినిమా థియేటర్లో నడుస్తున్నంత వరకు నిర్మాత నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఇదో పెద్ద స్కామ్.. అని ధీరజ్ వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ 2 నుంచి 3 లక్షలు ఇస్తేనే రేటింగ్ ఉంటుందని.. లేదంటే నెగిటివ్ పేరుతో బెదిరిస్తారని ధీరజ్ మొగిలినేని ఆరోపించారు. కాబట్టి సినిమా రివ్యూలు, రేటింగ్లు చూసి మోసపోవద్దని.. సినిమా చూడాలనుకుంటే చూడాలి తప్ప.. రేటింగ్, రివ్యూల ఆధారంగా చూడొద్దని విజ్ఞప్తి చేసారు.

