భక్తి పారవశ్యం వెల్లివిరియాల్సిన ఏడు కొండల్లో.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలాయి. TTDలో తవ్విన కొద్దీ బయటపడుతున్న కుంభకోణాలు సామాన్య భక్తులను విస్తుపోయేలా చేస్తున్నాయి. ఓవైపు తిరుమల పరకామణి చోరీ ఇష్యూ, లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యివాడకం, పట్టు వస్త్రాల కొనుగోళ్లలో అవకతవకలు లాంటి అంశాలపై విచారణ జరుగుతుండగానే.. మరో షాకింగ్ స్కామ్ వెలుగు చూసింది. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : ఆ ఐఏఎస్ అధికారులంటే ఎందుకంత ప్రేమ..?
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైసీపీ హయాంలో 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం 100 కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరలతో తాపడం చేయాల్సి ఉండగా, రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి.
అంతేకాదు, విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి TTD ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, EOగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్ లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో విజిలెన్స్ నిమగ్నమైంది. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు? బంగారం ఎంత వాడారు? అనే అంశంపై ఆరా తీస్తోంది.
Also Read : కేసీఆర్ లో చంద్రబాబు భయం..? పక్కా స్కెచ్ తోనే పాత రాజకీయం..?
వరుస కుంభకోణాలు చూస్తే దేవుడి సొమ్మును కూడా వదలని దౌర్భాగ్య స్థితి గత వైసీపీ పాలనలో నెలకొందని స్పష్టమవుతోంది. ఆధ్యాత్మికత ముసుగులో తిరుమలను రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేసిన తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

