అపార్ట్మెంట్లో ఉంటున్నారా.. అయితే ఇది మీ కోసమే. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి.. అలాగే భద్రత కూడా ఉంటుంది. ఇదే ప్రతి ఒక్కరి భావన కూడా. అయితే అపార్ట్మెంట్ వాసులకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని తెలుసుకోకుండా వ్యవహరిస్తే మాత్రం చిక్కుల్లో పడతారు. గతంలో 10 నుంచి 15 ప్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ కల్చర్ నుంచి ఇప్పుడు 60 నుంచి 80, 100 ప్లాట్లు ఉంటే కమ్యూనిటీలోకి వెళ్లేందుకు ఎక్కువ మంది సుముఖత చూపుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం పార్క్, పూల్, సౌకర్యాలు, భద్రత అని భావిస్తున్నారు. అయితే ఈ కమ్యూనిటీ పేరుతో కొందరు జరిమానాల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్నారు.
Also Read : ఆయన కోసం కొత్త పోస్టు సృష్టిస్తున్నారా..?
బెంగళూరులోని కెంగేరి సమీపంలోని ప్రావిడెంట్ సన్వర్త్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణకు ప్రధాన కారణం.. అందులో అద్దెకు ఉంటున్న వాళ్లతో పాటు యజమానులను కూడా బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇదేంటి.. అపార్ట్మెంట్లో ఉంటే డబ్బులు ఎందుకు కట్టాలనే అనుమానం వచ్చిందా.. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లు చేసిన తప్పులను బయట పెట్టకుండా ఉండేందుకు ఈ అసోసియేషన్ సభ్యులు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. చివరికి అసాంఘిక కార్యకలాపాలతో పాటు చట్ట వ్యతిరేక పనులు చేసినా కూడా వాళ్లను పోలీసులకు అప్పగించకుండా.. జరిమానా విధించి.. సరిపెట్టారు.
నిజానికి అపార్ట్మెంట్ అసోసియేషన్లు ఎలాంటి జరిమానా వసూలు చేయకూడదు. కేవలం మెయింటెనెన్స్ వరకే వాటి పరిధి. అదే సమయంలో అపార్ట్మెంట్ పరిధిలో నేరపూరిత కార్యకలాపాలు జరిగితే.. వాటిని పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత కూడా అసోసియేషన్ సభ్యులదే. కానీ ప్రావిడెంట్ సన్వర్త్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. అపార్ట్మెంట్లో ఉంటున్న బ్యాచ్లర్స్, కాలేజీ స్టూడెంట్స్ ప్లాట్లనే టార్గెట్ చేశారు. డ్రగ్స్, గంజాయ్, మద్యం వంటివి పట్టుబడితే.. వారికి జరిమానాలు విధించారు. ఒక ఫ్లాట్ యజమాని పనిమనిషితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వస్తే.. అపార్ట్మెంట్ పరువు పోతుందని ఆ విషయం బయటకు రానివ్వలేదు. అదే సమయంలో ఆ ఫ్లాట్ ఓనర్ నుంచి జరిమానా కింద రూ.50 వేలు వసూలు చేసినట్లు తెలిసింది.
Also Read : గ్రీన్ కార్డులపై ట్రంప్ సంచలన నిర్ణయం..!
ప్రావిడెంట్ సన్వర్త్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఇప్పటి వరకు 4 నుంచి 5 లక్షల వరకు జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షునితో పాటు కార్యదర్శిని, ఇద్దరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా సభ్యులు చట్టవిరుద్ధంగా ఫైన్లు వేస్తున్నా లేదా బ్లాక్ మెయిల్ చేస్తున్నా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

