భారతీయ సినిమాను గతంలో బాలీవుడ్ శాసించింది. యాష్ రాజ్, రెడ్ చిల్లీస్, ధర్మ ప్రొడక్షన్, యూ టీవీ మోషన్ పిచ్చర్స్, టీ సిరీస్, ఈరోస్ ఇంటర్నేషనల్.. ఈ సంస్థలు చెప్పిందే వేదం.. తీసిందే సినిమా అన్నట్లుగా ఉండేది. వీటిల్లో ఇప్పటికీ యాష్ రాజ్, టీ సిరీస్ సంస్థలు మాత్రమే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాయి. మిగిలినవి చిన్నగా వెబ్ సిరీస్, ఓటీటీలు, టెలివిజన్ సిరీయల్స్, డ్రామా షోస్ పైన పెట్టుబడులు పెడుతున్నాయి తప్ప.. సినిమాల జోలికి మాత్రం రావడం లేదు. అయితే ఈ సంస్థలు కేవలం బాలీవుడ్లో మాత్రమే పెత్తనం చేస్తున్నాయి. పైగా చిన్న నిర్మాతలపై ఏ మాత్రం ఒత్తిడి చేయటం లేదు కూడా. కానీ సౌత్ సినిమా మాత్రం ఇప్పుడు అంతా హాలీవుడ్ రేంజ్కు వెళ్లిపోయింది.
Also Read : రాజా సాబ్ షూటింగ్ ఇష్యూస్.. చేతులెత్తేసిన నిర్మాత
దక్షిణ భారత సినిమాలంటే తొలి నుంచి అంతగా పట్టించుకున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ సినిమాలంటే ఇతర భాషల్లో చిన్నచూపు. చివరికి తెలుగు, తమిళ, కన్నడ హీరోలు హిందీ వైపు రావడానికి కూడా ఒప్పుకునే వారు కాదు. మెగాస్టార్ చిరంజీవి 2 హిందీ సినిమాలు తీశారు. ఆజ్ కా గూండారాజ్, జెంటిల్మెన్ సినిమాలు హిందీలో పెద్దగా ఆడలేదనే మాట కంటే కూడా.. అక్కడ వాటిని అంతగా ఆడనివ్వలేదనే చెప్పాలి. తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ ఒకటి రెండు హిందీ సినిమాలు చేసినా కూడా.. వాళ్లు కూడా గోడకు కొట్టిన బంతి మాదిరిగా బాలీవుడ్ నుంచి నేరుగా కోలీవుడ్కు వచ్చేశారు.
తాజాగా భారతీయ సినిమాలో 3 బడా సంస్థలు పెత్తనం చేస్తున్నాయనే మాట బాగా వినిపిస్తోంది. దక్షిణ భారతంలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ సినీ పరిశ్రమలున్నాయి. వీటిల్లో మాలీవుడ్ మాత్రం చిన్న సినిమాలతో నడిపిస్తోంది. కానీ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ పరిశ్రమలు మాత్రం.. ఇప్పుడు తమ రేంజ్ పెంచేశాయి. ఏకంగా హాలీవుడ్ స్థాయికి చేరుకున్నాయి. దాదాపు పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ రావడం.. పుష్పతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం.. టాలీవుడ్ స్థాయి ఆకాశాన్ని అంటింది.
Also Read : కుప్పకూలిన బ్యాటింగ్.. భారీ పరాజయం దిశగా టీమిండియా
తెలుగు పరిశ్రమలో ఒక్కప్పుడు వైజయంతి, సురేష్, గీతా ఆర్ట్స్, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ వంటి సంస్థలు పెత్తనం చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం అంతా మైత్రీ మూవీస్ చేతుల్లోనే ఉంది. సినిమా నిర్మాణం మొదలు.. ప్రదర్శన వరకు మైత్రీ సంస్థ చేస్తోంది. 2015లో శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్లో ప్రవేశించిన మైత్రీ సంస్థ.. ఈ పదేళ్లల్లో చిన్న, పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్, చరణ్ పెద్ది సినిమాలు కూడా మైత్రీ సంస్థ చేతుల్లోనే ఉన్నాయి.
ఇక కోలీవుడ్లో లైకా ప్రొడక్షన్స్ పెత్తనం నడుస్తోంది. విజయ్ సినిమా కత్తి తో 2014లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన లైకా.. దాదాపు అన్ని పెద్ద సినిమాలే చేస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్.. ఇలా అందరితో సినిమాలు చేస్తోంది. తెలుగు, మళయాళం, సింహళి హిందీలో లైకా సంస్థ సొంత సినిమాలు తీస్తోంది.
Also Read : కర్నూలు టీడీపీపై ఆందోళనలో అధిష్టానం.. సంచలన నివేదికలతో కలవరం..!
శాండిల్వుడ్లో హోంబలే ఫిలింస్ సంస్థ చెప్పిందే వేదం. 2014లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నిన్నిందలే సినిమాతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన హోంబలే.. ఇప్పుడు ఏకంగా 10 వేల కోట్ల బ్రాండ్ వ్యాల్యూ సొంతం చేసుకుంది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ వరల్డ్ సినిమాలతో కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది హోంబలే. తాజాగా క్రికెట్ ఫ్రాంచేజ్ ఆర్సీబీని హోంబలే సొంతం చేసుకుంటుందనే మాట కూడా బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూడు సంస్థలు నిర్మిస్తున్న సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ స్టార్లు కూడా క్యూ కడుతున్నారు.

