మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మారేడుమిల్లి, రంపచోడవరం డివిజన్ లో తుపాకులు మరోసారి గర్జించాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మావో అగ్ర నేత మాడ్వీ హిడ్మా ప్రాణాలు కోల్పోగా నేడు మరో భారీ ఎన్కౌంటర్ జరగగా.. మరో అగ్ర నేత ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు హతం అయినట్లు పోలీసులు ప్రకటించారు. జోగారావు, జ్యోతి, సురేష్, గణేష్, శ్రీను, అనిత, షమ్మి అనే మావోలను హతమార్చినట్టు ప్రకటించారు. ఏవోబీ ఇన్ఛార్జిగా పనిచేసిన జోగారావు అలియాస్ టెక్ శంకర్ కీలక నేతగా గుర్తింపు పొందారు.
Also Read : మావోయిస్టుల అరెస్టుపై పోలీసుల సంచలన ప్రకటన.. అందుకే బెజవాడ వచ్చారా..?
డివిజనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన జ్యోతి.. ఆక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఈ వరుస ఎన్కౌంటర్ ల నేపధ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. ఏవోబీలో నిఘా పెంచి.. వాహనాలను పెద్ద ఎత్తున తనిఖీ చేస్తున్నారు. కొందరు మావోయిస్టులు పారిపోయి ఉంటారని అనుమానాల నేపధ్యంలో బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. పాడేరు ఏజెన్సీలోని వారపు సంతలపై పోలీసుల నిఘా పెట్టారు. 11 పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు.. అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకోవాలని సూచించాయి.
Also Read : పరకామణి కేసులో అన్ని వేళ్లు ఆయన వైపే..!
ఈ పరిస్థితుల నేపధ్యంలో కాసేపటి క్రితం మావోయిస్ట్ మాజీ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియో విడుదల చేసారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోందని, ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు పలువురి ప్రాణాలు పోయాయని, మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. అందుకే లొంగిపోవాలని మావోయిస్టులను కోరుతున్నానని విజ్ఞప్తి చేసారు. ఎన్కౌంటర్ ల భయం ఉన్న వారు.. తమ ద్వారా లొంగిపోవాలి అని ఆయన కోరారు. లొంగిపోవాలి అనుకునే వారు తమను సంప్రదించాలని కోరారు.

