మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సేఫ్ జోన్గా భావించే ఏపీ, తెలంగాణ బార్డర్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు అతని భార్య కూడా ఉన్నట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్తో దండకారుణ్యం నివురుగప్పిన నిప్పులా మారింది.
Also Read : భారత్ లో హమాస్ తరహా దాడులకు ప్లాన్..?
మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారేందుకు ఎంతో కాలం లేదని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2026 మార్చి నాటికి భారత్లో మావోయిస్టులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనేది ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతాల్లో మావోయిస్టు తిరుగుబాటుదారులపై భారత భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్య. ఈ ఆపరేషన్ 21 ఏప్రిల్ 2025న ప్రారంభించారు. నాటి నుంచి పదుల సంఖ్యలో మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
ఆపరేషన్ కగార్ దూకుడు పెంచడంతో మావోయిస్టులు కూడా వెనకడుగు వేశారనేది వాస్తవం. ఆపరేషన్ కగార్తో తమకు భారీ నష్టం జరిగినట్లు మావోయిస్టులు ఇప్పటికే ప్రకటించారు కూడా. జాతీయ స్థాయి ఉద్యమ నేతలు కూడా ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారు. వందల మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక దండకారుణ్యంలో తుపాకీ మోతలకు భయపడి కొత్తగా రిక్రూట్మెంట్ కూడా జరగటం లేదు. చాలా మంది దేశం వదిలి బంగ్లాదేశ్, నేపాల్ వైపు పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read : సజ్జన్నార్ పై పవన్ ఆసక్తికర కామెంట్స్..!
ఛత్తీస్గఢ్, ఒడిశా, ఝార్ఖండ్లో ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నాయి. దీంతో మావోయిస్టులు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను సేఫ్ జోన్గా మార్చుకున్నారు. ఈ విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది.. దండకారుణ్యాన్ని జల్లెడ పడుతోంది. తాజాగా ఏపీలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లిలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పలు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. వీరిలో కీలక నేతలున్నట్లు తెలుస్తోంది. కాల్పుల నేపథ్యంలో మారేడుమిల్లిలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు.

