ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు కీలక దశకు చేరుకుంది. జిల్లాలతో పాటుగా రెవిన్యూ డివిజన్ల సంఖ్య కూడా పెరగనుంది. అదే సమయంలో మండలాలు కూడా పెంచాలనే అంశంపై ఇప్పటికే రెవెన్యూ శాఖ చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలిచ్చారు. అందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రజల నుంచి వినతులు స్వీకరించి.. నివేదిక సిద్ధం చేసింది.
Also Read : కాంగ్రెస్ కోటలో జూబ్లీహిల్స్ గుబులు..!
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు అంశం కీలకంగా మారుతోంది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం కూడా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికలప్పుడు నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరణ చేశారు. 2004 వరకు ఏపీలో 26 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. 2009 నాటికి వాటి సంఖ్య 25కు తగ్గించారు. అలాగే అప్పటి వరకు ఉన్న 187 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా 175కు తగ్గించారు.
2029 నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య పెంచుతారనే మాట ఇప్పటికే వినిపిస్తోంది. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా జరుగుతుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. 2029 నాటికి నియోజకవర్గాల పెంపుతో పాటు రిజర్వేషన్లు కూడా మారుతాయనే ప్రచారం జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ప్రకటన దాదాపు తుది దశకు చేరుకుంది. ఇదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, మార్పు అంశం రాజకీయంగా ఉత్కంఠకు తెరలేపింది.
Also Read : ఉంటారా.. పోతారా.. లోకేష్ వార్నింగ్..!
అసెంబ్లీ నియోజకవర్గాల సర్దుబాటు అంశం పై చాలా రోజులుగా ఏపీలో చర్చ నడుస్తోంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు రిజర్వుడు నియోజకవర్గాల మార్పు కూడా ఉంటుందని పొలిటికల్ సర్కిల్లో టాక్. ఇదే సమయంలో పలు కీలక నియోజకవర్గాల్లో మార్పులు ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది. ఇది 2029 ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ అంశంపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజించారు. జిల్లాల సంఖ్యను 26కు పెంచారు. అయితే వీటిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే అంశం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు జిల్లాల్లో విలీనం దిశగా కూడా మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వీటిపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : క్యాబినెట్ నుంచి ఆ ముగ్గురు అవుట్..!
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా మార్కాపురం, మదనపల్లె కేంద్రంగా 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. నిజానికి కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. ప్రస్తుతం 2 మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు గిద్దలూరు, మడకశిర, అద్దంకి, పీలేరు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు అంశం.. పార్లమెంట్ నియోజకవర్గాలతో ముడిపడి ఉండటంతో.. ప్రస్తుతం ఆ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి ప్రతిపాదనలు చేయటం లేదని తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేసి.. జనవరి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన.

