రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేసారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందని, రాజధాని ఎక్కడో చెప్పకుండా నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసిందని వ్యాఖ్యానించారు.
Also Read : చంద్రబాబును తిట్టినా చలనం లేదా..? ఎందుకీ మౌనం..?
ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మించాలని ఆనాడే నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడే రాజధాని ఉండాలనే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించామని పేర్కొన్నారు. 25 పార్లమెంట్ స్థానాలకు మధ్యలో ఉన్న ప్రదేశాన్ని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారుచేశామన్న ఆయన.. ఆనాడు హైటెక్ సిటీ నిర్మించినప్పుడు నా విజన్ చెబితే అవహేళన చేశారన్నారు.
రాజధాని నిర్మాణానికి భూములు అవసరం కాగా.. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని కొనియాడారు. భూ సమస్య ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి నాకు దారి చూపించింది రైతులేనన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో భూసమీకరణ జరిగింది ఒక్క అమరావతిలోనే అని గుర్తు చేసుకున్నారు సిఎం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు వస్తాయి.. రైతుల అవస్థలు నేను చూశానని ఆనాటి పరిస్థితులపై సిఎం మాట్లాడారు. రోడ్డెక్కి అనేక ఉద్యమాలు చేశారన్నారు.
Also Read : యువతకు ఏం కావాలో తేల్చేసిన పవన్..!
రైతులు చేసిన త్యాగాలను ఏనాడు మరవను.. అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతుల సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్లకు బాధ్యతలు అప్పగించారు. రాజధాని రైతులు ఏ సమస్య ఉన్నా ఈ ముగ్గురు నేతలను కలవాలన్న సీఎం చంద్రబాబు.. నేతలు కూడా రైతులతో తరచుగా సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.