స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సంసిద్ధం కావాలని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్స్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుకర్ గుప్తా తెలిపారు. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
Also Read : టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలుంటాయా..?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని మధుకర్ గుప్తా వెల్లడించారు. పంచాయితీ రాజ్ చట్ట ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. డీలిమిటేషన్, రిజర్వేషన్ అమలు పరిశీలించాలని, ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు. రాజకీయంగా ప్రభావితం చేసే అంశాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరి సెల్ ఫోన్లో వారు స్వయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అధునాతనమైన సాంకేతికతను అమలులోకి తెస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, రాజకీయ ఒత్తిడి లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి సమర్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల పరిస్థితులపై సూక్ష్మ పరిశీలన చేయాలన్నారు.
Also Read : టీటీడీలో అది సాధ్యమేనా..?
స్థానిక సంస్థల ఎన్నికలను అధికారులు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని ఏపీ ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని తెలిపారు. బాపట్ల జిల్లాలో 459 గ్రామపంచాయతీలకు 426 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయని, మిగిలినవి కోర్టు కేసుల నేపథ్యంలో నిలిచి పోయాయన్నారు. 4,306 వార్డులు ఉండగా, గత ఎన్నికల్లో గెలుపొందిన వారి అధికారాలు 2026 ఏప్రిల్ ఒకటో తేదీ నాటితో ముగుస్తాయన్నారు. జిల్లాల పునర్ విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా పరిషత్ స్థానాలు పూర్వ జిల్లాల పరిధిలోనే ఉన్నాయన్నారు. గుంటూరు పరిధిలో 862 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 57 జడ్పిటిసి స్థానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ పరిధిలో 792 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 57 జడ్పీటీసీ స్థానాలున్నాయన్నారు. డిలిమిటేషన్ ప్రక్రియకు ప్రణాళికలు రూపొందించాలని నీలం సాహ్ని సూచించారు. మహిళా రిజర్వేషన్లు, ఎన్నికల నియమాలని పాటించాలని సూచించారు. వివాదాస్పద గ్రామాలు నూతన ఓటర్ల జాబితాలు సంసిద్ధం చేయాలంటూ అధికారులను సూచించారు.

