భారతీయ రాష్ట్ర సమితి భవిష్యత్తు లీడర్పై అధినేత నిర్ణయం తీసుకున్నారా.. పార్టీని విజయవంతంగా ముందుకు నడిపే నేత ఎవరో మాజీ సీఎం కేసీఆర్కు క్లారిటీ వచ్చేసిందా అంటే.. అవుననే మాట వినిపిస్తోంది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర కాలంగా పార్టీని నడిపించే భవిష్యత్తు లీడర్పై పార్టీలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పూర్తిగా దూరమయ్యారు. ఎన్నికల అనంతరం బాత్రూమ్లో జారి పడిన కేసీఆర్.. ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసినప్పటికీ.. కనీసం ఒక్క చోట కూడా పార్టీని గెలిపించలేకపోయారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవ్వటం లేదు. కేవలం కొందరు పార్టీ నేతలతో మాత్రమే ఫామ్హౌజ్లో సమావేశం అవుతున్నారు తప్ప.. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు రావడం లేదు.
Also Read : ఐదేళ్ల తర్వాత మేలుకుంటున్న మేధావులు..!
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఫ్యూచర్ లీడర్ కోసం జోరుగా చర్చ నడుస్తోంది. తొలి నుంచి బీఆర్ఎస్ పగ్గాలను మాజీ మంత్రి కేటీఆర్కు అప్పగిస్తారనే మాట బలంగా వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో మరో మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంపై గ్రూపు రాజకీయాలు కూడా నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యం. పైకి మాత్రం ఎవరికి ఇచ్చినా మాకేం ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ.. తెర వెనుక మాత్రం ఎవరికి వారు వారికి అనుకూలంగా పావులు కదుపుతున్నారనేది వాస్తవం. దీంతో పార్టీని ముందుండి నడిపించే లీడర్ ఎవరనే చర్చ జోరుగా నడుస్తోంది.
Also Read : పట్టు బిగిస్తున్న కాంగ్రెస్.. మోడీ దొరికిపోయారా..?
పార్టీ పగ్గాలు కేటీఆర్కు అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇదే విషయంపై ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర కామెంట్లు చేశారు. పార్టీ అధినేత నిర్ణయం శిరసా వహిస్తామన్నారు. కేటీఆర్ సారధ్యంలో నడిచేందుకు తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కేసీఆర్ మాటే ఫైనల్ అని స్పష్టం చేశారు కూడా. అటు కవిత కూడా తనపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు. పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నప్పటికీ.. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి గురించి బయటపెడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తన గురించి కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని కూడా కవిత ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేతులు మారతాయా లేదా అనేది ఆసక్తిగా మారింది.