రాజకీయాల్లో కొందరు ప్రభావిత వ్యక్తులు ఉంటారు. అలాగే కొంతమంది వేసే అడుగుల గురించి నిరంతరం చర్చ నడుస్తూనే ఉంటుంది. వారు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా సరే.. అదో పెద్ద సంచలనం అవుతుంది. అలాంటి వారిలో ఒకరు మజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి బావమరిదిగా అందరికీ తెలుసు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత నుంచి వైసీపీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత అనూహ్యంగా జగన్కు దూరమయ్యారు బాలినేని. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు జై కొట్టారు. నాటి నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు అటు గుంటూరు జిల్లాలో కూడా జనసేన పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read: వర్మని రెచ్చగొడుతున్న వైసీపీ..!
బాలినేని పార్టీ మారిన కొత్తల్లో అంతా విమర్శలు చేశారు. రాజకీయ లబ్ది కోసమే పార్టీ మారుతున్నాడనే మాట బాగా వినిపించింది. అయితే అవేవీ లెక్క చేయని బాలినేని… ప్రకాశం జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు జనసేనలో చేరేందుకు కృషి చేశారు. మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య సహా పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేయడం వెనుక బాలినేని హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఇక ఒంగోలు కార్పొరేషన్ను కూటమి సర్కార్ సొంతం చేసుకోవడం వెనుక కూడా బాలినేని గేమ్ ప్లాన్ ఉంది. ఎన్నికల ముందు నుంచి జగన్ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన బాలినేని… వైసీపీ ఫ్యూచర్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ మారిన నేతల్లో బాలినేనికి మాత్రమే ప్రసంగించే అవకాశం దక్కింది.
Also Read: ఇక ఆ పేరు మారదా..? 9 నెలలు చాల్లేదు..!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కష్టపడి ఎదిగారన్నారు బాలినేని. పదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వైసీపీ నేతలు చేసిన నీచమైన వ్యాఖ్యలను తట్టుకుని పవన్ నిలబడ్డారన్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దయతోనే జగన్ సీఎం అయ్యాడని వ్యాఖ్యలు చేశారు. ఒకసారికే సీఎంగా జగన్కు ప్రజలు అవకాశమిచ్చారన్నారు. “దమ్ముంటే మరోసారి సీఎం అవ్వు చూద్దాం” అంటూ బాలినేని సవాల్ విసిరారు. అదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై బాలినేని తేల్చేశారు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కల్యాణ్తో ఉంటానన్నారు. పదవి వచ్చినా రాకపోయినా సరే.. పవన్తోనే ప్రయాణిస్తా అని బాలినేని క్లారిటీ ఇచ్చారు.