వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వయసు చిన్నదే అయినా.. ఆలోచనలు మాత్రం పెద్దగానే ఉంటాయి. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతోనే నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఏపీలో ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేశారనే పేరు కూడా తెచ్చుకున్నారు. వైసీపీ స్థాపించిన తర్వాత ఇప్పటి వరకు వన్ మ్యాన్ షో అన్నట్లుగా ఉన్నారు తప్ప.. పార్టీలో సెకండ్ లీడర్ లేకుండా చేసుకున్నారు. చివరికి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు కూడా పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు జగన్.
Also Read : డీజిల్, పెట్రోల్ ను జీఎస్టీలో అందుకే చేర్చడం లేదా..?
ఏపీలో ప్రస్తుతం ప్రధాన పార్టీలు అంటే మూడు మాత్రమే గుర్తుకు వస్తాయి. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే రాజకీయం చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆ స్థాయిలో గుర్తింపు అయితే లేదు. స్థాపించిన తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చేలా రాజకీయం చేశారు జగన్. అయితే వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారనేది వాస్తవం. నియంతృత్వ పాలనతో పాటు అరాచకం, టార్గెట్ పాలిటిక్స్ చేయడంతో జగన్ పార్టీని అధఃపాతాళానికి తొక్కేశారు ప్రజలు.
అయితే జగన్ మాత్రం మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తూనే.. మరో వైపు తనకు మళ్లీ గుర్తింపు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గమే కరెక్ట్ అన్నట్లుగా ప్లాన్ చేస్తున్నారు. 2002లో టీఆర్ఎస్ స్థాపించిన కేసీఆర్.. పార్టీ గుర్తింపు కోసం పదవులకు రాజీనామాలు చేశారు. తెలంగాణ సాధన పేరుతో పదే పదే ఎన్నికలు జరిగేలా చూసుకున్నారు. అంటే.. అధికారంలో లేకపోయినా సరే.. ఏదో ఒకరకంగా ప్రజల్లో ఉండేలా చూసుకున్నారు. అందుకే వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాగలిగారు కూడా.
Also Read : ప్రభాస్ పై బాలీవుడ్ మాఫియా దాడి..!
ఇప్పుడు జగన్ కూడా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి 2012లోనే నాటి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వైసీపీలోకి ఆహ్వానించి.. వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికల్లో తిరిగి గెలిచేలా చూసుకున్నారు. దీని వల్ల ప్రజల్లో ఓ గుర్తింపు సాధించారు కూడా. ఇప్పుడు కూడా గెలిచింది 11 మందే కాబట్టి.. వారితో రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి గెలిస్తే.. తమకు ప్రజల మద్దతు ఉందని గొప్పగా చెప్పుకోవచ్చనేది జగన్ భావన. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం మంచిది కాదేమో అని కొందరు నేతలు సూచిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడితే.. ఉన్న పరువు కాస్త పోతుందని భయపడుతున్నారు. కాబట్టి ఉప ఎన్నికలకు పోదామా.. వద్దా అనే విషయంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.

