ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ టార్గెట్గా వైసీపీ భారీ కుట్రకు తెరతీసిందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జగన్తో పాటు వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలను కూటమి ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది. ఉద్యోగం రాని అభ్యర్ధుల లేవనెత్తిన ప్రతి అంశానికి పక్కా ఆధారాలతో అధికారులు సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకంలో ఎక్కడా ఏ తప్పు జరగలేదని.. కూటమి సర్కారు స్పష్టంగా వివరించినా.. జగన్ అండ్ కో మాత్రం డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ.. అదే అరిగిపోయిన రికార్డు రిపీట్ మోడ్లో వినిపిస్తున్నారు.
Also Read : ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్.. పంచాయితీలకు పండగ
డీఎస్సీ ప్రక్రియపై సీబీఐతో విచారణ చేయించాలని మరోసారి ఎక్స్లో పోస్టు ద్వారా జగన్ డిమాండ్ చేశారు. ఆయన మీద ఇప్పటికే డజనుకు పైగా సీబీఐ కేసులు ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు అక్రమంగా సంపాదించారని.. అప్పటి కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో కేసు వేయడంతో.. న్యాయస్థానం జగన్ మీద సీబీఐ విచారణకు ఆదేశించింది. తన మీద సీబీఐ కేసులున్నాయి కాబట్టి.. లోకేష్ ని సీబీఐ కేసులో ఇరికించాలనే కుట్రలో భాగంగానే డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అనడానికి ఆధారాలుంటే జగన్ కూడా కోర్టుకు వెళ్లొచ్చు. తన మీద సీబీఐ విచారణకు ఆదేశించినట్లే.. లోకేష్ మీద కూడా విచారణకు ఆదేశించ వచ్చు. కానీ కోర్టుకి వెళ్తే ఆధారాలు చూపించాలి.. అవి లేవు కాబట్టే.. తనకు అనుకూలమైన మీడియాలో… తానే జడ్జిలాగా మీడియా ట్రయల్ నిర్వహించి.. లోకేష్ ని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలోలాగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదు. అమ్మో పులి కథలో పిల్లాడిలాగా.. వైసీపీ నాయకులు.. మళ్లీ మళ్లీ అబద్దాలు చెప్పి.. ఎవరూ నమ్మలేని పరిస్థితికి చేరుకున్నారు. ఒకే అబద్దాన్ని వంద సార్లు కాదు కదా.. లక్షసార్లు చెప్పినా.. జనం దాన్ని అబద్దంలాగే చూస్తున్నారు గానీ.. మళ్లీ మళ్లీ రిపీట్ చేసినంత మాత్రాన నిజం అనుకోవడం లేదు.
Also Read : కింగ్ పిన్ చుట్టూ ఉచ్చు.. ఫైనల్ కాల్కు లైన్ క్లియర్..!
గూగుల్ డేటా సెంటర్, అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి అంతర్జాతీయ పెట్టుబడుల సాధనతో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ సంపాదించుకొంటున్నారు. అదే సమయంలో మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి విద్యా శాఖలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. లోకేష్ కి ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ రావడం తట్టుకోలేకనే.. డీఎస్సీ ప్రక్రియ ముగిసిన ఏడాది తర్వాత అక్రమాలంటూ రాద్దాంతం చేస్తున్నారని టీడీపీ నాయకుల ఆరోపణ.
జగన్తో స్టార్ట్ చేసి.. వైసీపీలో ప్రతి ఒక్కరూ లోకేష్ ని టార్గెట్ చేయడం ద్వారా ఆయన్ని హీరోని చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా పని చేస్తేనే దాని మీద విమర్శలు చేయగలరు. జగన్ లాగా ఏ పనీ చేయకపోతే.. దాన్ని చేతగాని తనంగా చూస్తారు తప్ప.. చేయని పనిలో లోపాలు వెతకలేరు. ఇక్కడ జగన్ చేయలేని పని లోకేష్ చేసి చూపించారు. 16 వేల పోస్టులతో విజయవంతంగా మెగా డీఎస్సీని నిర్వహించారు. జగన్ చేయలేని పని చేసిన లోకేష్ ని అభినందించాలా.. ఆ పని చేసినందుకు తప్పుడు ఆరోపణలతో నిరుద్యోగులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న జగన్ను నిలదీయాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

