తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్టులుగా బాధ్యతలు చేపట్టిన నాయకులు వివాదాలతో పదవులకు దూరమవుతుండటం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పంపిన దూతలు.. చివరకు అపవాదులను మూట గట్టుకొని వెళ్లాల్సి వస్తుంది. 2021లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జుగా మాణిక్యం ఠాగూర్ బాధ్యతలు చేపట్టారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో ఇద్దరి మధ్య సమన్వయం పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చింది. అయితే, మాణిక్యం ఠాగూర్ పూర్తిగా రేవంత్ రెడ్డికే మద్దతుగా వ్యవహరిస్తున్నారని, సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఈ అసంతృప్తి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లడంతో పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని లేదా ఇన్చార్జుని తప్పించాలని కొందరు సీనియర్ నేతలు డిమాండ్ చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు తెలంగాణ ఇన్చార్జు బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ను ఏఐసీసీ తప్పించింది.
Also Read : లోకేష్ ని హీరోని చేస్తున్న జగన్ అండ్ కో..!
ఆ తర్వాత మహారాష్ట్ర నేత మాణిక్ రావ్ ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జుగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలక పాత్ర పోషించారు. పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి స్పష్టంగా కనిపిస్తుందని అనేక మంది నేతలు చెబుతుంటారు. కొత్త, పాత నేతలను సమన్వయం చేశారన్న పేరు కూడా ఉంది. అయితే.. ఆయనపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్రకు తరచూ రాకపోకలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ ప్రచారాల్లో నిజమెంత ఉందో కానీ, చివరకు ఆయన కూడా ఇన్చార్జు పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ఆ తర్వాత దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జుగా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిశీలకురాలిగా వ్యవహరించిన అనుభవం ఉండటంతో ఆమెకు ఏఐసీసీ.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జు బాధ్యతలు అప్పగించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడంలో మున్షీ కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. అయితే, లోక్సభ ఎన్నికల సమయంలో టికెట్లు వచ్చేలా చూస్తానని.. కొందరి వద్ద డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొందరి నుంచి మంత్రి పదవి లేదంటే నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు. ఖరీదైన కార్లు, బంగారం కానుకలుగా తీసుకున్నారని.. ఇప్పటి వరకూ వచ్చిన ఇన్ఛార్జులు అందరిలో దీపాదాస్ విలాసవంతమైన జీవనం గడిపారని పార్టీలో చర్చ జరిగింది. ఇన్చార్జులుగా వచ్చిన వారెవరైనా ఎమ్మెల్యే క్వార్టర్స్ లేదా హోటల్లో ఉండేవారు. కానీ, దీపాదాస్ మున్షీ మాత్రం ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండేవారని, అది పార్టీ నేతలకు భారంగా మారిందని అప్పట్లో ప్రచారం జరిగింది. చివరకు దీపాదాస్ మున్షీ కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
Also Read : పైకి సింగిల్ సింహం.. చీకటిలో అందరితో మింగిల్..!
గాంధేయవాదిగా పేరున్న మీనాక్షి నటరాజన్కు ఏఐపీపీ తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. సింప్లిసిటీకి కేరాఫ్గా కనిపిస్తారామె. మొదటి నుండి అతి సాధారణ జీవితం, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చే మీనాక్షి.. రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితురాలు కూడా. అయితే ఆమె వ్యవహారం పార్టీలో కొందరికి ఇబ్బందిగా మారిందని చెప్పాలి. సూటిగా మాట్లాడే తత్వమున్న మీనాక్షిని తెలంగాణ నుంచి తప్పించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసే సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు కూడా అంతర్గత చర్చలకు దారితీశాయి. అంతేకాదు మీనాక్షి సైతం కొందరు నేతలకు అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు కూడా ఉంది.

