రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. రష్యా దాడులకు ధీటుగా బదులిస్తున్న ఉక్రెయిన్, ఇప్పుడు సరికొత్త వ్యూహంతో రష్యా భూభాగంపై విరుచుకుపడుతోంది. రష్యాకు ఆర్థికంగా, సైనికంగా అత్యంత కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఉక్రెయిన్ సైన్యం అధునాతన డ్రోన్లతో వరుస దాడులకు తెగబడుతోంది. ఈ వ్యూహాత్మక దాడులతో రష్యా రక్షణ రంగానికి ఉక్రెయిన్ గట్టి సవాల్ విసురుతోంది. ఈ తాజా డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన ప్రముఖ చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Also Read : కాషాయ పార్టీ స్పెషల్ ఫోకస్.. టార్గెట్ ఫిక్స్..!
ముఖ్యంగా రష్యా ఇంధన సరఫరాలో కీలకమైన స్లావ్యాన్స్కీ, యారోస్లావ్ లలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల దాటికి ఆయా ప్లాంట్లలో భారీగా మంటలు చెలరేగడంతో పాటు ఇంధన ఉత్పత్తికి, సరఫరాకు పెద్ద ఎత్తున విఘాతం కలిగింది. యుద్ధంలో రష్యా సైన్యానికి అవసరమైన ఇంధన లభ్యతను దెబ్బతీయడం, అలాగే రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ధ్యేయంగా ఉక్రెయిన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ భారీ డ్రోన్ దాడులతో రష్యా రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Also Read : సింగపూర్ లో ఏపీ బంగినపల్లి సందడి..!
ఉక్రెయిన్ సరిహద్దుల దాటి వచ్చి మరీ రష్యా గుండెకాయ లాంటి చమురు క్షేత్రాలపై దాడులు చేస్తుండటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు వేరే లెవెల్ కు చేరుకున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ ను ప్రభావితం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయనే మాట వినపడుతోంది. రష్యా రక్షణ దళాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుండటంతో, ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అనే ఆందోళన పెరుగుతోంది.

