విజయవాడలో పెను సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణను ప్రత్యేక విచారణ బృందం మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్రపై సిట్ అధికారులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసులో సరికొత్త పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, కస్టడీ మరణం వెనుక అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజుతో పాటు స్టేషన్ కు చెందిన కొందరు కింది స్థాయి సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read : సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..!
ఇందులో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై సిట్ దర్యాప్తును కేంద్రీకరించింది. ఈ కేసులో విచారణ ముమ్మరం కావడంతో సదరు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు గత రెండు రోజులుగా విధులకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు పంపిన పిలుపులకు, ఆదేశాలకు కూడా వారు స్పందించడం లేదు. వారి ఫోన్లు సైతం అందుబాటులో లేకపోవడంతో వారు విచారణకు భయపడి పరారయ్యారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా గుండెపోటు వస్తుందా..?
సాయికృష్ణను కస్టడీలో ఉంచిన సమయంలో అసలేం జరిగింది..? సాక్ష్యాల ధ్వంసంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో సిట్ ఆధారాలు సేకరిస్తోంది. సీఐ నాగరాజును ఇప్పటికే అదుపులోకి తీసుకుని జైలుకు తరలించిన సిట్ అధికారులు, మిగిలిన నిందితులను కూడా పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. సిట్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ వ్యవహారం విజయవాడ పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

