వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో, కారుమూరి నాగేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు ఎలాంటి ఊరట లభించకపోవడంతో ఇప్పుడు వైసీపి శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : అల్లు అర్జున్ సంచలన కామెంట్స్..!
గత వైసీపి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలో మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని, నిబంధనలను తుంగలో తొక్కి తమకు నచ్చిన సిండికేట్లకు లబ్ధి చేకూర్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిట్ ఆరోపిస్తున్నాయి. నాటి మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తన రాజకీయాధికారాన్ని అడ్డం పెట్టుకుని, తన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ తో కలిసి ఈ కుంభకోణానికి తెరతీశారని దర్యాప్తు సంస్థలు కోర్టుకు వెల్లడించాయి.
Also Read : ఎవరీ సారాంశ్ జైన్..? 11 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..!
ఈ వ్యవహారంలో ఇప్పటికే కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, అతను చంచల్ గూడ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం ద్వారా వందల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని, సబ్ కాంట్రాక్టుల ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్ము నేరుగా కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి బదిలీ అయిందని దర్యాప్తు సంస్థలు గట్టి ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచాయి. కస్టోడియల్ విచారణ ద్వారా మాత్రమే ఈ కేసులో పూర్తి స్థాయి నగదు చలామణి, లబ్ధిదారుల వివరాలు బయటకు వస్తాయని దర్యాప్తు అధికారులు వాదించారు. ఈ వాదనలను ఏకీభవించిన సుప్రీంకోర్టు, కారుమూరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ తాజా పరిణామంతో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు దర్యాప్తు సంస్థల ముందు మార్గం సుగమమైంది.

