తెలంగాణాలో మంత్రి వర్గ కూర్పు ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటుగా రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే నేతలు కూడా మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటుగా రేవంత్ రెడ్డికి కొందరిని కేబినేట్ లో తీసుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు పెద్ద తలనొప్పిగా మారాయి. దానితో పాటుగా శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఈ తరుణంలో… రేవంత్ కు సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు విషయంలో సిఎం ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో బలమైన నేతగా కూడా గుర్తింపు ఉంది. దీనితో మండవను కేబినేట్ లోకి తీసుకోవాలని ఆయన అనుభవం తనకు ఉపయోగపడుతుందని రేవంత్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఆయనను కేబినేట్ లోకి తీసుకునేందుకు రేవంత్ అధిష్టానం వద్ద కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్టు సమాచారం.
Also Read : టీపీసీసీ చీఫ్కు తొలి సమస్య… ఎలా డీల్ చేస్తారో మరి?
ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని రేవంత్ భావిస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారే అవకాశం ఉంది. ఆయనను రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకుని ఆ పదవిని మండవకు ఇచ్చి రేవంత్ కేబినేట్ లోకి తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ లో కొందరు నేతలకు కూడా సిఎం క్లారిటీ ఇచ్చారు. మండవను టీడీపీలోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం నేపధ్యంలో కాంగ్రెస్ లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారట. మరి మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

