టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, పంజాబ్ కింగ్స్ కీలక ప్లేయర్ యజువేంద్ర చహల్ వివాదంలో చిక్కుకున్నాడు. విమాన ప్రయాణంలో ఉండగా చాహల్ వేపింగ్.. అంటే ఈ-సిగరెట్ వాడుతున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు, పౌర విమానయాన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విమాన భద్రతా నిబంధనలను అతిక్రమించినందుకు గాను అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : ఏపీలో ఇక 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్..!
భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం, విమానం లోపల ధూమపానం లేదా ఈ-సిగరెట్ల వాడకం పూర్తిగా నిషేధించారు. విమానంలో స్మోకింగ్ చేయడం వల్ల స్మోక్ డిటెక్టర్లు యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, ఇది ఇతర ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడమే అవుతుంది. గతంలో కూడా ఇటువంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డీజీసిఏ కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ విచారణలో చాహల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, అతనిని అన్-రూలీ ప్యాసింజర్ కింద పరిగణించే అవకాశం ఉంది.
Also Read : బీజేపీలోకి కొడాలి నాని.. నిజమేనా..?
దీనివల్ల అతన్ని నిర్ణీత కాలం పాటు విమాన ప్రయాణాలు చేయకుండా నో-ఫ్లై లిస్ట్ లో పెట్టవచ్చు. ఐపీఎల్ సమయంలో ఇది జరిగితే, జట్ల మధ్య ప్రయాణాలకు చాహల్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై అటు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం గానీ, ఇటు బిసిసిఐ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ చేస్తూ దొరికిపోవడంతో, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. చాహల్ ఉదంతం కూడా అదే తరహాలో ఉండటంతో, బిసిసిఐ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

