తెలంగాణ భవన్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మాక్ అసెంబ్లీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. మాక్ అసెంబ్లీలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్రను పోషించడంపై ఆయన వెటకారం ప్రదర్శించారు. కేసీఆర్కు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, కేవలం మాక్ అసెంబ్లీలో మాత్రమే కాకుండా, అసలైన శాసనసభలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని, కాబట్టి చేతుల్లో ఉన్న పనిని చేసి తలసానిని ప్రతిపక్ష నేతగా నియమిస్తే బీఆర్ఎస్ పార్టీని నమ్ముతామని పేర్కొన్నారు.
Also Read : లోకల్లో జనసేన దూకుడు.. టీడీపీ బ్రేకులు..!
అదే సమయంలో, అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని తాము స్పీకర్ను కోరతామని వెల్లడించారు. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించిందనే వార్తలపై స్పందిస్తూ, అలాంటి సమాచారం తమకు ఏమీ లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని నిషేధిత భూముల చట్టం 22A నిబంధనల అంశంపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి పౌరులకు ఎలాంటి నష్టం లేదా ఇబ్బంది జరగకూడదని అభిప్రాయపడ్డారు.
Also Read : బాబు పోలవరం Vs కేసీఆర్ కాళేశ్వరం.. ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు
ఒకవేళ చట్టంలోని నిబంధనల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, అవసరం అనుకుంటే చట్టంలో తగిన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల రక్షణ ఎంత ముఖ్యమో, అమాయక ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. గాంధీభవన్లో వినాయక చవితి వేడుకల అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షాలు కేవలం అబద్ధాల ప్రచారం చేయడం మానేసి, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవు పలికారు.

