Wednesday, June 3, 2026 08:02 PM
Wednesday, June 3, 2026 08:02 PM

అన్నామలై కొత్త పార్టీ : తమిళనాడులో మరోసారి రాజకీయ వేడి !

దక్షిణాదిన మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకునే సమయం ఆసన్నమైంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీని వీడి తన పుట్టిన రోజు జూన్ 4న అన్నామలై ‘మక్కల్ శక్తి అయ్యక్కం’ పేరిట కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు తమిళనాడులో చర్చ మొదలైంది. అన్నామలై బీజేపీలో అసంతృప్తితో ఉన్నారని వస్తున్న ఊహాగానాల నడుమ ఈ వార్తలు వెలువడ్డాయి. అయితే ఇదే విషయంపై అన్నామలైను కలిసిన నేతలకు రెండు రోజుల్లో తన వైఖరిని స్పష్టం చేస్తానని కొత్త పార్టీ సమాధానమిచ్చారు. దీంతో అన్నామలై కూడా విజయ్ మాదిరిగా కొత్త పార్టీ పెడతారా..? లేదంటే మరో పార్టీలో చేరుతారా? అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు త్రి భాషా విధానాన్ని అమలు చేయడంపై సీబీఎస్ఈ చేసిన ప్రకటనను అన్నామలై వ్యతిరేకించడం, ఆ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం వంటి అంశాలు ఆయన తన సొంత పార్టీని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారనే ప్రచారం.. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో తమిళనాడులో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది.

Also Read : అవి చేసే ముందు.. నటి ఘాటు వ్యాఖ్యలు..!

2021లో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నామలై.. అప్పటి అధికార డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనేక సమావేశాలు నిర్వహించారు. అలాగే ‘ఎన్ మణ్.. ఎన్ మక్కల్’.. నా నేల, నా ప్రజలు పేరుతో పాదయాత్ర చేశారు. డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు ప్రజల్లో బాగా చర్చనీయాంశం అయ్యాయి. దీని ఫలితంగా అన్నామలైపై డీఎంకే పరువునష్టం దావా కూడా వేసింది. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీటీవీ దినకరన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలను అన్నాడీఎంకేలోకి తీసుకురావడంలో కూడా అన్నామలై కీలక పాత్ర పోషించారు.

2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఆ సమయంలో అన్నామలైని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. నైనార్ నాగేంద్రన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. తన స్థానంలో నాగేంద్రన్‌ను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించినప్పటి నుంచి బీజేపీతో అన్నామలై అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ అంతర్గత విభేదాలకు నిదర్శనంగానే ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అన్నామలై నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : గెట్ రెడీ ఫర్ వార్.. పవన్ వార్నింగ్..!

అన్నామలై పోటీ చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం పదే పదే పట్టుపట్టినప్పటికీ, ఆయన ఆ అభ్యర్థనను తిరస్కరించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి మూడో స్థానానికి పరిమితం అయ్యింది. బీజేపీ కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అన్నామలై తన పుట్టినరోజు జూన్ 4వ తేదీన ‘మక్కల్ శక్తి అయ్యక్కం’ అనే పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారని వారం రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఈ పుకార్లను ఖండిస్తున్నారు. అన్నామలైకి పార్టీలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నాయంటున్నారు.

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగంకు ప్రత్యామ్నాయంగా అన్నామలై కొత్త పార్టీని స్థాపించాలని కోయంబత్తూరులోని ఆయన మద్దతుదారుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. కోయంబత్తూరులో అన్నామలై ఫొటోలతో ఉన్న పోస్టర్లు పెట్టారు. ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన అన్నామలై కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు. అనతి కాలంలో పార్టీపై పట్టు సాధించి తమిళనాడు బీజేపీ యూనిట్‌కు అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత విపక్షాలను ఎండగడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒకవేళ అన్నామలై బీజేపీని వీడితే ఆ పార్టీకి చాలా నష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

శ్రీశైలం భక్తుల కష్టాలు...

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం....

బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా...

దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని...

టీడీపీ ఖాతాలో మరో...

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ-3...

గెట్ రెడీ ఫర్...

తెలంగాణలో పోటీపై వస్తున్న పుకార్లకు జనసేన...

రాజ్యసభ కోసం బీజేపీ...

ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో...

పవన్ సభకు బ్రేకులు.....

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ...

పోల్స్