ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ వేగవంతం చేసారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అధికారికంగా అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ అరెస్ట్ ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా జరిగిన దాదాపు రూ. 195 కోట్ల మద్యం రవాణా అవకతవకలపై ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది.
Also Read : కాషాయ నేతలతో బీ కేర్ ఫుల్..!
ఈ సిండికేట్ లో కారుమూరి సునీల్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ తన అభియోగాల్లో మోపింది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుండి సుదర్శన కన్స్ట్రక్షన్స్ కు మద్యం రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులను కేటాయించడంలో సునీల్ తన రాజకీయ రికమండేషన్లను ఉపయోగించారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో గత కొన్ని రోజులుగా ఈడీ అధికారులు వేగం పెంచారు.
Also Read : రెండు పార్టీల్లో “సర్” భయం..!
ఈ నెల ప్రారంభంలోనే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు ఆయన కుమారుడు సునీల్ నివాసాలతో పాటు కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో కీలకమైన డిజిటల్ ఆధారాలు, డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల అనంతరం తాజాగా సునీల్ ను విచారించిన అధికారులు, నిధుల మళ్లింపు జరిగినట్లు తగిన ఆధారాలు లభించడంతో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

