ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్ గ్రాంట్ కింద 13,302 కోట్లు.. పెర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద 3,225 కోట్లు ఇచ్చింది. 2026-27 ఆర్ధిక సంవ్సతరం నుంచి ప్రారంభించి రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ నిధులు రాష్ట్రానికి వస్తాయి. గత ఐదేళ్ల కాలానికి పదిహేనవ ఆర్ధిక సంఘం 12,800 కోట్లు కేటాయించగా.. 16వ ఆర్ధిక సంఘం కాలానికి అదనంగా 3,827 కోట్ల రూపాయలు ఇచ్చారు.
Also Read : రోడెక్కుతున్న తూర్పు కాపులు.. కారణం..!
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో వస్తున్న నిధులతో గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. ఈ నిధుల నుంచి రోడ్ల పనులకు 10 శాతం వరకు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని గ్రామంలో ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది, ప్రజల అవసరాల కోసం వినియోగించాలి.
రాష్ట్రానికి కేటాయించిన మొత్తం నిధుల్లో 70 శాతం గ్రామ పంచాయితీలకు, 15 శాతం మండల పరిషత్లకు, మరో 15 శాతం జిల్లా పరిషత్లకు కేటాయిస్తారు. ఈ నిధులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలి. మూడు గ్రామీణ సంస్థలకు సంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి. గ్రామం నుంచి మండల, జిల్లా స్థాయి వరకు అభివృద్ది ప్రణాళికలను ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
Also Read : ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్.. ఎలాన్ మస్క్..!
గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలు, పారిశుద్ధ్యం గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇక రోడ్లు ఎంత దారుణంగా ఉండేవో ప్రజలందరికీ తెలుసు. అప్పట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించడంతో.. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జాడ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా.. సిమెంట్ రోడ్ల నిర్మాణం వంటి పనులతో రూరల్ ఏరియాల్లో డెవలప్మెంట్పై ఫోకస్ చేస్తోంది. 16వ ఆర్ధిక సంఘం నిధులతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది.

